మిషన్ కర్మయోగి అంటే?: ప్రయోజనాలేంటీ? ఇక ఆ వ్యవస్థ రూపురేఖల్లో: రూ.510 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మిషన్ కర్మయోగి.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన ప్రాజెక్టు. జాతీయ విద్యావిధానంలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ప్రతిపాదించిన మరో విప్లవాత్మక మిషన్. ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల్లో ఒకటైన బ్యురోక్రసీ స్థాయిని పెంచడానికి ఉద్దేశించిన మిషన్ ఇది. అటెండర్ నుంచి ఐఎఎస్ అధికారి స్థాయి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల్లో జవసత్వాలను నింపడానికి, వారి పనితీరును ఎప్పటికప్పుడు సానబెట్టడానికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించింది.

కాలానుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో మార్పులు..
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును, వారి సామర్థ్యాన్ని నిరంతరం పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మిషన్ కర్మ యోగికి ప్రాజెక్టును ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం ఈ కొత్త వ్యవస్థకు తెరపైకి తీసుకుని వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని, పనితీరును, వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడానికి ఇది ఉపకరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఒక విభాగాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే.. అటెండర్ స్థాయి ఉద్యోగి నుంచి ఆ విభాగాధిపతి వరకూ దీన్ని వర్తింపజేస్తారు.

బ్యురోక్రసీలో భారీ సంస్కరణలకు..
బ్యూరోక్రసీలో భారీ సంస్కరణలను తీసుకుని రావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మిషన్ కర్మయోగి ప్రాజెక్టును ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ సృజనాత్మకతను పెంచుకోవడానికి, కొత్త తరహాలో ఆలోచనలు చేయడానికీ, డెలివరీ వ్యవస్థను మరింత సరళంగా రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వృత్తి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడానికి, ఉద్యోగుల్లో జవాబుదారితనానికి, పారదర్శకతకు మరింత పదును పెట్టొచ్చని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

నిర్లక్ష్యానికి, అవినీతికి చెక్..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లక్ష్యం, అలసత్వం అధికంగా ఉంటుందనే పేరు ఉంది. దాన్ని తొలగించడంతో పాటు అవినీతిపరులకు చెక్ పెట్టడానికీ మిషన్ కర్మయోగి ద్వారా కేంద్రం చర్యలను తీసుకుంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడానికి ఉద్యోగ వ్యవస్థే కీలకం. అందులో నెలకొన్న అవినీతి జాడ్యం వల్ల ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ది కలగట్లేదనే అభిప్రాయంతో ఉన్న కేంద్రం.. సమగ్ర ప్రక్షాళనకు తెర తీసినట్టయిందని చెబుతున్నారు.

అభిరుచులు, విద్యార్హతలకు అనుగుణంగా..
ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల అభిరుచులు, విద్యార్హతలకు అనుగుణంగా వారిని ఆయా శాఖల్లో నియమించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సరైన వ్యక్తిని.. సరైన ప్రదేశంలో నియమించడం.. అనే సూత్రం ఆధారంగా కేంద్రం ఇకపై నియామకాలను చేపట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మిషన్ కర్మయోగిని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్పీసీఎస్సీబీ)గా పిలుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షణలో ఇది పని చేస్తుంది.
Recommended Video

వచ్చే ఐదేళ్లలో రూ 510 కోట్ల వ్యయం
దీన్నంతటినీ పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేస్తుంది. ప్రధానమంత్రి ఛైర్మన్గా, ఎంపిక చేసిన కొందరు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు దీని గవర్నింగ్ బాడీలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 46 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరినీ ఈ మిషన్ పరిధిలోకి తీసుకొస్తారు. సంస్కరణల దిశగా, కాలానుగుణంగా వారికి శిక్షణ ఇస్తారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వచ్చే అయిదేళ్ల కాలంలో 510.86 కోట్ల రూపాయలను వ్యయం చేస్తుంది.












Click it and Unblock the Notifications