మిషన్ మోడీ: మోడీ, బీజేపీల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ప్రముఖ స్వామీజీలు
లక్నో: 2019 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలోనే ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార బీజేపీ మరోమారు "మిషన్ మోడీ" కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ సారి దాని పేరు "మిషన్ మోడీ అగెయిన్"గా మార్చింది. మొత్తం 350 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనికి నేతృత్వం వహిస్తోంది మాజీ బీఎపీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి. అక్టోబర్ 24 నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 350 నియోజకవర్గాల్లో అమలు చేస్తామని మిషన్ మోడీ అగెయిన్ సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్గోపాల్ కాకా తెలిపారు.

మిషన్ మోడీ అగెయిన్కు శ్రీకారం
"మిషన్ మోడీ అగెయిన్" కార్యక్రమం ప్రారంభానికి ముందు మూడురోజుల పాటు అయోధ్యలో హోమం నిర్వహించనున్నారు. ఈ హోమంలో దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు హాజరుకానున్నారు. "మిషన్ మోడీ అగెయిన్" క్యాంపెయిన్ 108 రోజుల పాటు లోక్సభ నియోజకవర్గాల్లో ఉంటుంది. ఇది మొత్తం 8 రాష్ట్రాల్లో జరగనుంది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో క్యాంపెయినింగ్ ఉంటుందని కాకా చెప్పారు.

వారణాసి నియోజకవర్గంలో మూడు నుంచి ఆరు సభలు
ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసిలో ఆరు నుంచి ఎనిమిది సభలు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జగద్గురు రంభాదర్ ఆచార్య, స్వామి వాసుదేవానంద్ సరస్వతితో పాటు పలువురు ప్రముఖ స్వామీజీలు కూడా పాల్గొని మోడీ దేశానికి ప్రధానిగా మరోసారి ఎందుకు అవ్వాలో తమ ప్రసంగంలో తెలుపుతారని కాకా చెప్పారు. అంతేకాదు మోడీ చేసిన పనులను కూడా ఈ స్వామీజీలు వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో మార్పులపై కూడా స్వామీజీలు మాట్లాడుతారని కాకా వెల్లడించారు.

ప్రచారంలో పాల్గొననున్న స్వామీజీలు
108 వాహనాలు ప్రచారంలో భాగమవుతాయని ఇందులో 500 మంది ఉంటారని ప్రచార నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న రాఘవేశ్వర్ దాస్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో హోమం నిర్వహించి తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చేందుకు ప్రార్థనలు పూజలు నిర్వహిస్తామని రాఘవేశ్వర్ చెప్పారు. అయితే స్వామీజీలు ప్రధాని మోడీ కోసం ప్రచారంలో పాల్గొనడం ఇది తొలిసారి అవుతుంది . ఇప్పటి వరకు స్వామీజీలు బీజేపీకి తమ దీవెనెలు మాత్రమే అందించారు. ఇప్పటి వరకు ఎక్కడేకానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ ఈ సారి మాత్రం స్వామీజీలు ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమవుతుండటం కాస్త ఆసక్తికరంగా మారింది.

అభివృద్ధి వెనక్కు...మతఘర్షణలు ముందుకు
మోడీ బీజేపీ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ స్వామీజీ చెప్పారు. అన్ని పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీని లక్ష్యంగా చేసుకుని ముందుకెళుతుండటంతోనే బీజేపీ తరపున ప్రచారం చేసి వారి వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు స్వామీజీ చెప్పారు. హిందూమతాన్ని పరిరక్షించుకునేందుకు స్వామీజీలు కూడా తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ప్రచారంలో స్వామీజీలు పాల్గొంటే అభివృద్ధి వెనక్కు నెట్టబడిపోతుందని... దీని ద్వారా మతఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మతప్రాదిపతికన ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఇదే కాషాయం పార్టీకి కావాల్సింది అని మరో సీనియర్ జర్నలిస్టు విమర్శించారు.












Click it and Unblock the Notifications