పన్ను ఎగవేస్తే ఇక అంతే! ఖాతాలు దుర్వినియోగం చేసినా
నల్లధనం మార్చేందుకు ఇతరుల ఖాతాలు వినియోగిస్తే చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. ఖాతాలు దుర్వినియోగమైతే సొంతదారుపై ఐటీ చట్టం కింద విచారణ చేపడతామని తెలిపింది.
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారుల పైన కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో చాలామంది నల్ల ధనం కలిగిన వారు తమ డబ్బులను ఇతరులకు ఇచ్చి వారి అకౌంట్ల ద్వారా తెల్ల ధనంగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నల్లధనం మార్చేందుకు ఇతరుల ఖాతాలు వినియోగిస్తే చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. తమ ఖాతాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే సదరు వ్యక్తి పైన ఐటీ చట్టం కింద విచారణ చేపడతామని తెలిపింది.
బ్లాక్ మనీ నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరింది. జన్ ధన్ యోజన కింద ఉన్న అకౌంట్ హోల్డర్స్ తమ ఖాతాలను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. అలా చేస్తే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
కాగా, ఏటీఎంల సామర్థ్యం రూ.4లక్షల నుంచి రూ.60లక్షలకు పెంచనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గురువారం నాడు 22,500 ఏటీఎంలు కొత్త సాఫ్ట్వేర్తో అందుబాటులోకి రాగా, శుక్రవారం నాడు మరో 12,500 ఎటీఎంల సామర్థ్యం పెంపునకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మరికొద్ది రోజుల్లో మరిన్ని ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి.