ఆ మహిళలు ఇన్నేళ్లేం చేశారు, అంతా అబద్దం, కోర్టుకెళ్తా: 'మి టూ'పై ఎంజే అక్బర్
న్యూఢిల్లీ: 'మి టూ' అంటూ తనపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఆదివారం స్పందించారు. తన పైన వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని కొట్టి పారేశారు. రాజకీయ కారణాలతో తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై ఎవరయితే ఆరోపణలు చేస్తున్నారో వారు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తనపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎలాంటి ఆధారం లేని ఆరోపణలు వైరల్గా మారుతున్నాయని వాపోయారు.
ఏది ఏమైనా నేను ఇప్పుడు వచ్చానని, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది తన తరఫు లాయర్లు నిర్ణయిస్తారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఏదైనా అజెండా ఉందా అని ప్రశ్నించారు.
మి టు' ఆరోపణలపై తర్వాత మాట్లాడుతా: ఎంజే అక్బర్ రాజీనామా చేశారా?
ఇలాంటి ఆధారం లేని, అవాస్తవమైన ఆరోపణలు తన పరువుకు భంగం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. ఇది తనన తీవ్ర ఆవేదనకు గురు చేసిందన్నారు. కాబట్టి తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళల్లోని ప్రియా, గజాలా వంటి వారు ఇన్నాళ్లు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
తనపై వారు ఏవైతే ఆరోపణలు చేశారో, ఎప్పుడు అయితే ఆ సంఘటన జరిగిందని చెబుతున్నారో, ఆ తర్వాత కూడా తనతో వారు పని చేశారని, కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఆరోపణలు చేసినట్లుగా కనిపిస్తోందని అన్నారు. దశాబ్దకాలంగా వారు దేనికి మౌనం పాటించారో చెప్పాలన్నారు. ఇదిలా ఉండగా ఆయన రాజీనామా చేయలేదని తెలుస్తోంది. తనపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఆయన కేంద్ర విదేశాగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలవనున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.