గప్చుప్గా!: కర్నాటక బిజెపి ఎమ్మెల్యే ఆనంద్ అరెస్ట్
బెంగళూరు: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కు అధికారులు గురువారం కర్నాటక మాజీ పర్యాటక శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ విజయనగర్ శాసన సభ్యుడు ఆనంద్ సింగ్ను అరెస్టు చేశారు. 1.45 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారనే ఆరోపణలు ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు.
ఎమ్మెల్యే సెప్టెంబర్ 19వ తేది నుండి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో గురువారం అతను వస్తున్న విషయం తెలుసుకున్న సిబిఐ అతనిని అరెస్టు చేసింది. అతనిని గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సిబిఐ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. సిబిఐ కోర్టు న్యాయమూర్తి అతనిని అక్టోబర్ 26వ తేది వరకు సిబిఐ కస్టడీకి అప్పగించారు.
ఆనంద్ సింగ్ గురువారం ఉదయం సింగపూర్ నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై అయిదు నిమిషాలకు బెంగళూరుకు వచ్చారు. అతను వస్తున్న విషయం తెలుసుకున్న సిబిఐ అతనిని తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అరెస్టు చేసింది.
అరెస్టు చేసిన అనంతరం అతనిని శివాజీనగర్లోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పరీక్షల అనంతరం బళ్లారి రోడ్డులోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తీసుకు వెళ్లారు. అక్కడి నుండి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
ఆనంద్ సింగ్కు సిబిఐ కోర్టు అక్టోబర్ 11న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ విషయాన్ని సిబిఐ అధికారులు రహస్యంగా ఉంచారు. ఆనంద్ సింగ్కు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అతనికి తెలిస్తే తప్పించుకునే అవకాశాలున్నాయని భావించి రహస్యంగా ఉంచారు.