రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు కోవర్ట్ .. జలవివాదాలు అప్పుడు లేవా లోకేష్ ? రోజా ధ్వజం !!
వైసిపి నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా చంద్రబాబును, లోకేష్ ను , రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో ఉండకుండా పారిపోయి వచ్చింది లోకేష్ తండ్రి కాదా ? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించిన రోజా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కోవర్టు రెడ్డి గా పని చేస్తున్నాడని తీవ్ర విమర్శలు గుప్పించారు.
వైఎస్సార్ ను విమర్శించే తెలంగాణా మంత్రులకు పుట్టగతులుండవ్ : మంత్రి బాలినేని ధ్వజం
రైతులను దగా చేసింది గత చంద్రబాబు ప్రభుత్వమే
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా రైతులను దగా చేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని రోజా పేర్కొన్నారు. రైతుల కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, వివిధ పథకాల ద్వారా రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నారని వెల్లడించారు. 83 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేసిన ప్రభుత్వం జగన్ సర్కార్ అని రోజా చెప్పుకొచ్చారు.
చంద్రబాబు, లోకేష్ వి దిగజారుడు రాజకీయాలు
ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు రోజా. రైతులను దగా చేసింది చంద్రబాబేనని దుయ్య బట్టారు. వైయస్సార్ పాలన రైతు రాజ్యంగా పేరుపొందిందని, ఆయన బాటలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందని పేర్కొన్నారు రోజా. నకిలీ విత్తనాలతో చంద్రబాబునాయుడు మోసం చేస్తే, సీఎం జగన్ అగ్రి ల్యాబ్ ప్రారంభించి నాణ్యమైన విత్తనాలు అందజేస్తున్నారు అని , రైతు ప్రయోజనాల కోసం జగన్ ఎంతవరకైనా వెళ్తారని రోజా పేర్కొన్నారు.
అప్పుడు ఉమా, హరీష్ రావు.. పోలీసులు కొట్టుకోలేదా ?
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జల వివాదాలే లేవని నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్న రోజా గతంలో అక్క ఉమా, హరీష్ రావు, తెలంగాణ, ఏపీ పోలీసులు కొట్టుకున్న విషయాన్ని లోకేష్ మరిచిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో ఉండకుండా చంద్రబాబు పారిపోయి వచ్చారు అని విమర్శించిన రోజా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన రోజా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కోవర్టుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి కి రోజా స్ట్రాంగ్ కౌంటర్
మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్ ల మంతనాలు జరిగాయని రేవంత్ రెడ్డి అంటున్నారని ఫైర్ అయిన రోజా తన ఇంటికి సీఎం జగన్ ఎప్పుడు వచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. కెసిఆర్ దైవదర్శనానికి తమిళనాడు వెళుతూ మార్గ మధ్యలో మా ఇంటికి వచ్చారు తప్ప ఎలాంటి మంతనాలు జరగలేదని పేర్కొన్నారు రోజా. కెసిఆర్ కు చంద్రబాబు గతంలో ఇరవై ఎనిమిది రకాల వంటకాలు తో విందు ఏర్పాటు చేసింది రేవంత్ కు గుర్తు లేదా అంటూ రోజా ప్రశ్నించారు.
Recommended Video
ఏపీ బీజేపీ నాయకులవి దిగజారుడు మాటలు
అసలు తన ఇంటికి రాని జగన్, కేసీఆర్ తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా ప్రశ్నించారు. పచ్చ మీడియాతో కలిసి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అని అర్థం అవుతుందని రోజా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ నాయకులపై కూడా రోజా మండిపడ్డారు. బిజెపి నాయకులు దిగజారుడు మాటలు మాట్లాడటం మంచిది కాదని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రోజా గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాశారని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రోజా అభిప్రాయపడ్డారు.