గూండాయాక్ట్, ఇరానీ గ్యాంగ్కు సంబంధం: ఎంఎన్ రెడ్డి
బెంగళూరు: బెంగళూరు నగరంలో చైన్ స్నాచర్ లకు చెక్ పెట్టేందుకు గూండా యాక్ట్ చట్టం అమలు చేసేందుకుసిద్దం అయ్యామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అన్నారు. చైన్ స్నాచింగ్ లు చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంగళవారం ఆయన బెంగళూరు ఆగ్నేయ విభాగం పోలీసులు స్వాదీనం చేసుకున్న రూ. 7 కోట్ల విలువైన బంగారు నగలు, చోరీ సోత్తును పరిశీలించారు. ఈ సందర్బంగా ఎం.ఎన్. రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ ల సిబ్బందికి ఈ విషయంపై సూచనలు ఇచ్చామని అన్నారు.
చైన్ స్నాచింగ్ లు చేస్తున్న వారిని పట్టుకుని గూండా ఆక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అన్నారు. ఈ నెల జూన్ 11వ తేదిన ఉదయం ఒక గంట వ్యవదిలో 10 చైన్ స్నాచింగ్ లు జరిగాయని గుర్తు చేశారు. బైక్ లలో వచ్చిన నిందితులు గొలుసులు లాక్కోని వెళ్లారని అన్నారు.
ఆ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఎం.ఎన్ రెడ్డి చెప్పారు. పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల నుండి వచ్చి చైన్ స్నాచింగ్ లు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
బెంగళూరు నగరంలో జరుగుతున్న చైన్ స్నాచింగ్ లకు ఇరానీ గ్యాంగ్ లకు సంబంధం ఉందని ఇప్పటికే సీసీబీ పోలీసు అధికారులు ఆధారాలు సేకరించారని అన్నారు. ఇప్పటికే ఇరానీ గ్యాంగ్ లీడర్ మహమ్మద్ ఇరానీని విచారణ చేసి వివరాలు సేకరించామని, త్వరలో అందరిని అరెస్టు చేస్తామని ఎం.ఎన్. రెడ్డి వివరించారు.