అదే తప్పైతే నేను మళ్లీ చేస్తా: చైనాలో మోడీ, రాహుల్కు 'సెలవు' కౌంటర్
షాంఘై: పని చేయడం తప్పైతే, మళ్లీ మళ్లీ ఆ తప్పును తాను చేస్తానని, ఏడాదిలో 30 ఏళ్ల పని చేయడానికి ప్రయత్నిస్తున్నానని చైనా సీఈవోలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. దురుద్దేశ్యంతో ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు.
మహాత్మా గాంధీ యుగపురుషుడు అని, ప్రపంచ పౌరుడు అని అన్నారు. ఆత్మబలంతో జ్ఞానానికి తలుపులు తెరుచుకుంటాయన్నారు. తన దురదృష్టం ఏమిటంటే ఒక్క క్షణం కూడా విరామం తీసుకోకుండా కష్టపడి పని చేస్తున్నందుకు విపక్షాలు తనను విమర్శిస్తున్నాయన్నారు.
ఒకవేళ అదే నేరమైతే, నూట పాతిక కోట్ల భారతీయుల కోసం ఆ నేరం చేయడానికి నేనెప్పుడూ సిద్దమే అన్నారు. తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ మోడీని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. భారత్లోని విమర్శకులు కూడా తనను విమర్శిస్తున్నా మోడీ ఇప్పటి వరకూ మౌనంగానే ఉన్నారు.
తొలిసారిగా ఆయన ఈ విమర్శలకు జవాబు ఇచ్చారు. చైనా పర్యటనలో భాగంగా చివరి రోజైన శనివారం షాంఘైలో ఆయన భారత్-చైనా బిజినెస్ ఫోరంలోనూ, చైనా టాప్ సీఈవోలను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే, చైనాలోని భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు.
మోడీ మాట్లాడుతూ.. తాను అన్ని దేశాల్లో ఎందుకు తిరుగుతున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారని, ఎవపైనా తక్కువ పని చేస్తే విమర్శలు సహజమని, కానీ పని చేస్తుంటే తన పైన విమర్శలు వస్తున్నాయన్నారు. రోజులు మారుతున్నాయని, ప్రపంచం ఇప్పుడు భారతదేశాన్ని కొత్త కోణంలో చూస్తోందని, ఇందుకు కారణం గత ఏడాదిగా తన పాలనే అన్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున మూడు హామీలు ఇచ్చానని, అదే విసుగు విరామం లేకుండా పని చేస్తానని, తనకు అనుభవం లేదని, అయినా నేర్చుకుంటానని, దురుద్దేశంతో నేను ఎటువంటి తప్పులు చేయనని చెప్పానని, ఆ మూడింటినీ నెరవేర్చానన్నారు.
నేను ఎక్కడైనా సెలవు తీసుకున్నానా? విరామం తీసుకున్నానా? నా హామీలను నెరవేర్చడం లేదా? రాత్రింబవళ్లు పని చేశానన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల దాదాపు రెండు నెలలు సెలవు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన పేరు ప్రస్తావించకుండానే, సెలవు పేరిట ఆయన కౌంటర్ ఇచ్చారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గ్జియాన్ వచ్చి మరీ తనకు స్వాగతం పలికారని, చైనా అధ్యక్షుడు బీజింగ్ నుంచి బయటకు వచ్చి స్వాగతం పలకడం ఆ దే శ చరిత్రలో ఇదే తొలిసారని, ఇది మోడీకో, మోడీ బృందానికో ఇచ్చిన గుర్తింపు కాదని, 125 కోట్ల భారతీయులకు ఇచ్చిన గుర్తింపు అన్నారు.