రామమందిరానికి భూమిపూజ చేయడంతోనే కాదు.. మరో రికార్డును నెలకొల్పిన మోడీ: అదేంటో తెలుసా?
అయోధ్య: చారిత్రాత్మక అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజను చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు. రామమందిరం భూమిపూజకు పూనుకోవడం ఇందులో ఒకటి కాగా..శతాబ్దాల పాటు అత్యంత వివాదాస్పదంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతాన్ని సందర్శించడం మరొకటి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కొనసాగినన్ని రోజులూ ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించలేదు. ఆ రికార్డును నరేంద్ర మోడీ బ్రేక్ చేశారు. రామజన్మభూమిని సందర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా రికార్డు నెలకొల్పారు.

భూమిపూజతో నాంది..
శ్రీరామచంద్రుడి మహాద్బుత ఆలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. తొలి ఇటుకను వేశారు. కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన 175 మంది ప్రతినిధుల సమక్షంలో భూమిపూజ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చారు. తొలుత హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. ఆంజనేయుడికి పూజలు చేశారు. అనంతరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాబ్రీ మసీదుతో ముడిపడి ఉండటం వల్లే
దేశం నలుమూలల నుంచి సేకరించిన తొమ్మిది ఇటుకలకు పూజలను నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తు కాగా.. రామమందిరం ప్రదేశాన్ని సందర్శించడం ఒక ఎత్తు. ఎందుకంటే.. ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి కూడా రామజన్మభూమి ప్రదేశాన్ని సందర్శించడానికి సాహసించలేదు. దీనికి కారణం- అందరికీ తెలిసిన విషయమే. రెండు వర్గాలకు చెందిన ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతాన్ని ఇదివరకు ప్రధానమంత్రులెవరూ దర్శించలేదు.

వివాదం సమసిన తరువాతే మోడీ కూడా..
బాబ్రీ మసీదుతో ముడిపడి ఉండటం, అత్యంత సమస్యాత్మక, సున్నితమైన అంశం కావడం వల్ల రామజన్మభూమిని ఏ ప్రధానమంత్రి కూడా సందర్శించలేదు. ఇక్కడ గమనించదగ్గ విషయం మరొకటి ఉంది. నరేంద్ర మోడీ కూడా.. ఈ వివాదం పరిష్కారమైన తరువాతే రామజన్మభూమిని సందర్శించారు. న్యాయస్థానాల్లో ఉన్న సమయంలో మోడీ సైతం ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. న్యాయపరమైన చిక్కుముడులు వీడిన తరువాతే.. మోడీ రామజన్మభూమిని సందర్శించారు. శిలాన్యాస్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
Recommended Video

తొమ్మిది నెలల్లో
దేశ అత్యున్నత న్యాయస్థానంలో చాలాకాలం పాటు నలిగిన అంశం రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం. దశాబ్దాల కాలం పాటు ఇది పరిష్కారానికి నోచుకోకుండా అలా ఉండిపోయిందంతే. విచారణల మీద విచారణలతో కొనసాగుతూ వచ్చింది. గత ఏడాది నవంబర్లో దీనికి ముగింపు పలికింది సుప్రీంకోర్టు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ భూవివాదానికి చరమగీతం పలికింది. రామజన్మభూమి ప్రాంతం రామ్లల్లా విరాజ్మాన్కు చెందుతుందంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్తో కూడిన ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్ను వెలువడిన తొమ్మిది నెలల వ్యవధిలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications