యూపీ గెలుపు: అబుదాబి ప్రిన్స్ థ్రిల్, మోడీకి అభినందన
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీకి అబుదాబి నుంచి అభినందనలు వచ్చాయి. అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ సహ్యాన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
భారత గణతంత్ర్య దినోత్సవం రోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అల్ సహ్యాన్ ప్రధాని మోడీకి మంచి స్నేహితుడు కూడా. యూపీ, ఉత్తరాఖండ్లలో మోడీ సునామీతో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ గెలుపుపై అల్ సహ్యాన్ థ్రిల్ అయ్యారు. ఆయనకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నారైల సంబరాలు
యూపీ తదితర రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. సిలికాన్వ్యాలీ నుంచి న్యూయార్క్ దాకా, వాషింగ్టన్ డీసీ తదితర ప్రాంతాల్లో భారత సంతతి అమెరికన్లు సంబరాల్లో జరుపుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి మంత్రమే ఈ ఎన్నికల్లో ఘనవిజయానికి కారణమంటూ హర్షం వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీలో భారత సంతతి అమెరికన్లు పెద్దసంఖ్యలో టీవీల ముందుచేరి ఎన్నికల ఫలితాలను ఉత్కంఠతో వీక్షించారు.
మోడీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చూపే నేత అని, తాజా శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం ఉత్తరాఖండ్లో వాణిజ్య, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తున్నామని, మరింత మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దుతుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్ నుంచి వచ్చి సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన నవీన్ బిస్త్ పేర్కొన్నారు.