భారత్లో కోవిడ్ విజృంభణ వెనుక ? మోడీ సర్కార్ తప్పిదాలివే- సర్వత్రా ఇదే చర్చ
భారత్ ప్రపంచానికే ఫార్మసీగా మారుతోందన్న ప్రధాని మోడీ, కరోనా సంక్షోభంపై భారత్ పోరాటం తుది దశకు చేరుకుందన్న ఆరోగ్య మంత్రి హర్షవర్దన్, భారత్ కోవిడ్ 19 మార్గాన్ని బెక్హామ్ తరహాలో నిటారుగా వంచగలిగిందన్న రిజర్వు బ్యాంకు.. ఈ ప్రకటనలు విన్న వారెవరికైనా భారత్ పూర్తిగా కరోనాను తరిమేసిందన్న ఆలోచన కలుగుతుంది. కానీ ఈ అంచనాలన్నీ తప్పేనని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. ఈ ప్రకటనలు వచ్చిన అతి కొద్ది కాలంలోనే కరోనా మళ్లీ విజృంభించింది. ఇంతకీ ఈ కల్లోలం వెనుక అసలు కారణాలేంటన్న చర్చకు మాత్రం ఫుల్స్టాప్ పడటం లేదు.
భారత్లో కరోనా కల్లోలం
భారత్లో ప్రస్తుతం కరోనా కల్లోలం రేపుతోంది. గత శీతాకాలంలో వస్తుందని భావించిన సెకండ్ వేవ్ కాస్తా వేసవి కాలంలో వచ్చింది. శీతాకాలంలో క్రమంగా తగ్గిపోయిన కేసుల్నీ ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశంలో తయారైన వ్యాక్సిన్లు దేశీయంగా వాడాల్సిన అవసరం తక్కువగా ఉండటంతో నిన్న మొన్నటి వరకూ విదేశాలకే ఎక్కువగా పంపిన పరిస్దితి నుంచి ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఎదుర్కోవాల్సిన పరిస్ధితి వచ్చేసింది.
విదేశాలకు టీకా ఎగుమతులు ఆపేసినా దేశీయంగా వ్యాక్సిన్లు సరిపోవడం లేదు. కొత్త కేసులకు సరిపడా పడకలు ఆస్పత్రుల్లో లేవు. చాలా రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టాల్సిన పరిస్ధితులు. దీంతో మరోసారి కల్లోలం తప్పడం లేదు.
మరో లాక్డౌన్ ముంగిట దేశం
అయితే అసలు తప్పు ఎక్కడ జరిగింది. దేశంలో తొలి విడత కరోనా వ్యాప్తి తగ్గడం ప్రారంభించాక కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్లు వేయడం వల్ల కరోనా తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు. అయినా తమ చర్యల వల్లే కరోనా తగ్గిందన్న భావన అధికార గణంలో కనిపిస్తోంది. దేశంలో పెరుగుతున్న అతివాద జాతీయ భావనలు ఓవైపు.. అధికారుల అసమర్ధత మరోవైపు కొత్త సంక్షోభానికి కారణమవుతున్నాయి. తమను తాను అతిగా అంచనా వేసుకున్న తీరు ఇప్పుడు దేశాన్ని మరో లాక్డౌన్ ముంగిట నిలబెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరిగిన అహంకార ధోరణి
గతేడాది కఠినమైన లాక్డౌన్ విధించిన తర్వాత అన్ని సమస్యలకూ అదే పరిష్కారం అన్న ధోరణి కేంద్రంలోని పెద్దలతో పాటు అధికార గణంలోనూ పెరిగిపోయింది. వ్యాక్సిన్ల కంటే కూడా తాము లాక్డౌన్ అమలు చేసిన విధానమే గొప్పదన్న అహంకార ధోరణి వారిలో కనిపించింది. అందుకే భారత్లోకి కొత్త వైరస్ రకాలు అడుగుపెడుతున్న సంకేతాలు కనిపించినా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిద్దం కాలేదు. చివరికి విదేశీ రకాల వైరస్లు ప్రభావం చూపడం మొదలుపెట్టాక వ్యాక్సినేషన్ ప్రారంభించినా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు హడావిడిగా వ్యాక్సిన్లు వేద్దామన్నా పనిచేసే పరిస్ధితి లేదు.
అతివాద జాతీయవాద ధోరణి
కరోనా వైరస్కు అడ్డుకట్టే వేసే వ్యాక్సిన్ల తయారీలో మన దేశంతో పాటు విదేశాలు కూడా పోటీ పడ్డాయి. రష్యా, యూరప్, యూఎస్ సహా పలు దేశాల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిని మన దేశంలో పరీక్షించాక కానీ అనుమతించరాదని కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో మూడో దశ ట్రయల్స్ కూడా పూర్తి కాకుండానే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ను మాత్రం అత్యవసర వాడకం పేరుతో దేశీయంగా అనుమతించారు. దీంతో ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రగ్ కంట్రోలర్స్ ఆమోదించిన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి వ్యాక్సిన్లు దేశీయంగా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
వ్యాక్సిన్ల విషయంలో అన్నీ వైఫల్యాలే
కరోనా నియంత్రణ కోసం వ్యాక్సిన్ తయారు చేసిన సంస్ధలకు క్రెడిట్ పోకుండా వాటి ధరల్ని కేంద్రం నియంత్రించడం మొదలుపెట్టింది. తద్వారా జనంలో ఆదరణ పెంచుకునేందుకు ప్రయత్నించింది. సీరం తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను మార్కెట్లో 150 రూపాయలకే ఇచ్చేలా కేంద్రం నియంత్రించింది. చివరికి ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకునేందుకు, విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా అవకాశం లేకుండా చేసింది.
దీంతో విదేశాలకు ఇస్తామన్న ఆర్డర్లు ఇవ్వడంలో విఫలమైన సీరం ఇన్స్టిట్యూట్ బ్రిటన్ భాగస్వామి ఆస్ట్రాజెనెకా నుంచి నోటీసులు కూడా అందుకుంది. అయినా ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో దాన్ని విక్రయించలేని పరిస్దితి. జనవరిలో సీరం ఇన్స్టిట్యూట్ 50 మిలియన్ వ్యాక్సిన్ డోసుల్ని నిల్వ చేయగలిగింది. అయినా కేంద్రం వాటి కొనుగోలు ఆర్డర్లపై సంతకాలం చేయడంలో విఫలమైంది. వీటిలో కేవలం 11 మిలియన్ల డోసుల్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇలాంటి అనిశ్చిత పరిస్ధితులు, దూరదృష్టి లేకపోవడం, ఇతరత్రా వైఫల్యాల కారణంగా కరోనా రెండో సంక్షోభం ముంగిట దేశం నిలిచింది.