‘నో ఫ్రిస్కింగ్’ లిస్ట్ నుంచి తొలగింపు: స్వాగతించిన వాద్రా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాను ఇకపై విమానాశ్రయాల్లో తనిఖీ చేయకుండా వదలరు. యూపిఏ హయాంలోని పదేళ్ల కాలంలో వాద్రాను విమానాశ్రయాల్లో ఏనాడూ తనిఖీ చేయలేదు.
దేశీయంగా ఎక్కడ ప్రయాణించినా, విదేశాలకు వెళ్తున్నా ఎన్నడూ ఆయన్ను తనిఖీ చేయలేదు. అయితే ఇకపై ఆయన్ను అందరిలాగే తనిఖీ చేస్తారు. గతంలో ఆయన్ను తనిఖీ చేయకుండా వదిలిపెట్టే జాబితా నుంచి తొలగించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో తన పేరు ఆ జాబితానుంచి తొలగించుకోవడమే మేలని భావించిన వాద్రా.. తన పేరును తొలగించాలని కోరారు. తొలుత నిరాకరించిన కేంద్ర పౌర విమానయాన శాఖ ఆ తర్వాత ఎట్టకేలకూ అంగీకరించింది.
ఎయిర్ పోర్టుల్లో తనిఖీ అవసరం లేని ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి రాబర్ట్ వాద్రా పేరును తొలగిస్తున్నట్లు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇకపై దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో వాద్రాను తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తారు.
కాగా, 'ఫెంటాస్టిక్.. వాళ్లు చేసిన పనికి చాలా ఆనందిస్తున్నాను' అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు వాద్రా. 'ఒకవేళ ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి నా పేరు తొలగించకపోతే.. నేనే అన్ని ఎయిర్ పోర్టులకు వెళ్లి నా పేరు మీద స్టిక్కర్ అంటిస్తా' అని రెండు రోజుల కిందట వాద్రా తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.