అవినీతికి దారులు తెరిచిన మోడీ సర్కార్-కేసుల విచారణకు సర్కార్ అనుమతి తప్పనిసరి-వీరికి ఊరట
దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న అవినీతిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. దానిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం దీనిపై రాజీపడేందుకు సిద్ధమైపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్ధల ఛైర్మన్లు, ఎమ్మెల్యేల అవినీతిపై దర్యాప్తుల విషయంలో భారీ ఊరటనిచ్చింది. ఇకపై వీరిపై అవినీతి కేసుల్ని దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనసరని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో అవినీతి నిరోధక విభాగాల పని మరింత కష్టతరం కానుంది.
విచ్చలవిడిగా అవినీతి
దేశవ్యాప్తంగా అవినీతి కేసుల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. దర్యాప్తు సంస్ధలు వేల కొద్దీ కేసులు నమోదు చేస్తున్నా అవినీతి తగ్గకపోగా ఇంకా పెరుగుతోంది ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవినీతిపరులు వాటికి జంకే పరిస్ధితి లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న మొత్తాల్ని అవినీతి నిరోధానికి ఖర్చుచెస్తే భారీ ప్రయోజనం ఉంటుందని తెలిసినా ఇప్పటికీ ప్రభుత్వాలు ఆ దిశగా ముందడుగు వేయడం లేదు.
విదేశాల నుంచి నల్లధనం తెస్తామన్న మోడీ సర్కార్ ఆ మాట ఎప్పుడో మర్చిపోయింది. అయినా దాని గురించి ప్రశ్నించే పరిస్ధితి లేదు. దీంతో ఇప్పుడు అవినీతిపై మాట్లాడీ సమయం వృథా అని జనం మాట్లాడుకునే పరిస్ధితులు దాపురించాయి.
దారులు తెరిచిన మోడీ సర్కార్
ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతిపరులు రెచ్చిపోతున్నా దాని కట్టడి విషయంలో చర్యలు తీసుకోని మోడీ సర్కార్ ఇప్పుడు దాన్ని మరింత పెంచేందుకు వీలుగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న అవినీతి నిరోధక చట్టంలో 2018లో మార్పులు చేసిన కేంద్రం.. ఇప్పుడు దాన్ని అమల్లోకి తెస్తూ తాజాగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దీంతో అవినీతి పరులకు ఇది గొప్ప ఊరటగా మారబోతోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రభావంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులపై దాఖలైన అవినీతి కేసుల విచారణ దర్యాప్తు సంస్ధలకు మరింత భారంగా మారబోతోంది.
ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి
ఇకపై ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్ధల ఛైర్మన్లపై దాఖలైన అవినీతి కేసుల్ని దర్యాప్తు చేయాలంటే సదరు దర్యాప్తు సంస్ధలు కచ్చితంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదో ఒక దాని అనుమతి తీసుకోవాల్సిందే. అలా కాకుండా నేరుగా వారిపై అవినీతి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం కుదరదు. అవినీతి కేసుల్ని నమోదు చేసేందుకు కేంద్రం కానీ, రాష్ట్రం కానీ అనుమతి మంజూరు చేశాకే వాటిపై దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా దర్యాప్తు చేస్తే సదరు దర్యాప్తు అధికారులపై చర్యలు తప్పవు.
సింగిల్ విండో విధానంలో అనుమతి
ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్ధల ఛైర్మన్లపై అవినీతి కేసుల విచారణకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంలోని కనీసం డీజీ స్ధాయి అధికారి అనుమతి తీసుకోవాల్సిందేనని తాజా మార్గదర్శకాలు చెప్తున్నాయి. దర్యాప్తు అధికారులు వీరిలో ఎవరిపైన అయినా కేసు పెట్టాలంటే సింగిల్ విండో విధానంలో వారిని తొలగించే అధికారం ఉన్న అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుుంది.
అప్పుడు వారు అనుమతిస్తేనే తాము నమోదు చేసిన అవినీతి కేసులపై దర్యాప్తు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ఇలా అవినీతి కేసుల దర్యాప్తు చేసేందుకు సింగిల్ విండో అధికారుల్ని సైతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని మార్గదర్శకాల్లో తెలిపారు.
అవినీతి కేసుల దర్యాప్తు ఇలా
ఇలా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్ధల ఛైర్మన్లపై దాఖలు చేసిన అవినీతి కేసుల దర్యాప్తుపై సింగిల్ విండో అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరిపై అయితే ఈ కేసు నమోదు చేయాల్సి వస్తుందో వారు నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న చర్యలను పరిశీలించాలి.
అవి కచ్చితంగా చట్ట విరుద్ధంగానే ఉన్నాయని నిర్ధారణకు వస్తేనే వాటిపై దర్యాప్తుకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే తిరస్కరించే అధికారం కూడా సింగిల్ విండో అధికారులకు ఉంటుంది. అయితే ప్రస్తుత రాజకీయ వ్యవస్ధలో ఈ సింగిల్ విండో అధికారులు స్వతంత్రంగా పనిచేస్తారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే.
వీరందరికీ భారీ ఊరట
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన మార్గదర్శకాల ప్రకారం హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్ధల ఛైర్మన్లు, ఎండీలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఛైర్మన్లు, ఎండీలకు భారీ ఊరట దక్కబోతోంది. వీరిపై ఆషామాషీగా అవినీతి కేసులు పెట్టేందుకు దర్యాప్తు సంస్ధలకు ఎలాంటి అధికారం ఉండదు.
వీరిపై కేసులు పెట్టాలంటే ఇకపై కచ్చితంగా ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిందే. ప్రభుత్వాలు నియమించిన సింగిల్ విండో అధికారులు అనుమతి ఇవ్వకుండా వీరిపై దర్యాప్తు సంస్ధలు కేసులు పెట్టి వేధించడం ఉండదు. దీంతో రోజుల్లో దేశవ్యాప్తంగా అవినీతి మరింత విచ్చలవిడి కానుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Recommended Video
అవినీతికి తలుపులు బార్లా తెరిచారా?
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం గతంలో ఉన్న అవినీతి కేసుల చిట్టాతో పాటు కొత్తగా దాఖలయ్యే కేసులపైనా, వాటి దర్యాప్తులపైనా తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది సింగిల్ విండో వ్యవస్ధ అనుమతి తీసుకుంటే తప్ప ఎవరిపైనా కేసులు నమోదు చేయకూడదంటే, ఇక వాటి దర్యాప్తు ఎలా సాగుతుందో కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
దీంతో మోడీ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే వీరందరికీ అవినీతి కేసుల నుంచి ఊరటనివ్వాలనే నిర్ణయానికి వచ్చేసిందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ఇలా ప్రతీ కేసుకూ దర్యాప్తు సంస్ధల అధికారులు సింగిల్ విండో పర్మిషన్లు తీసుకోవాల్సిన అగత్యంతో పాటు పని భారం కూడా పెరగబోతోంది.