కేంద్రం ఉజ్వల పథకంపై తగ్గిన మోజు-భారీగా తగ్గిన సిలెండర్ల రీఫిల్లింగ్స్-షాకింగ్ గణాంకాలు
దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఎల్పీజీ వాడకాన్ని పెంచే లక్ష్యంతో 2016లో మోడీ సర్కార్ ప్రారంభించిన ఉజ్వల పథకం తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీకి భారీగా ఓట్లు కురిపించింది. అయితే ఈ పథకంలో లబ్దిదారులు ఏమేరకు గ్యాస్ వాడుతున్నారో తెలిస్తే మాత్రం షాక్ కాక తప్పదు. ఉజ్వల పథకంలో భాగంగా సిలెండర్లు ఇచ్చిన వారిలో ఎంతో మంది వాటిని వాడేందుకు మాత్రం నిరాసక్తత ప్రదర్శిస్తున్నట్లు తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది.
ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం 2016లో ఉజ్వల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మార్చి 2020 నాటికి 8 కోట్ల కనెక్షన్లను విడుదల చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని వాస్తవానికి మే 1, 2016న ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
దీని ప్రకారం తొలి ఏడాది 22 మిలియన్ల పేదలు, వెనుక బడిన, బలహీన వర్గాల ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించాలన్నది దీని లక్ష్యం. అయితే ప్రారంభించిన తొలి ఏడాదిలోనే దీనికి విశేష ఆదరణ లభించింది. తొలి ఏడాదిలోనే 30 మిలియన్ల కనెక్షన్ల మార్కును ఈ పథకం అందుకుంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటివరకు 9 కోట్లకు పైగా కనెక్షన్లు విడుదలయ్యాయి. PMUY 2.0 పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. దీని కింద అదనంగా మరో కోటి కనెక్షన్లను విడుదల చేయడానికి నిర్ణయించారు. కానీ అప్పటికే ఇచ్చిన కనెక్షన్ల సంగతి తెలిస్తే షాకవ్వాల్సిందే.
గ్యాస్ మంటతో వాడకంపై ప్రభావం
దేశవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న ధరల మంట ఉజ్వల పథకంపైనా ప్రభావం చూపింది. అప్పట్లో విచ్చలవిడిగా గ్యాస్ సిలెండర్లు తీసుకున్న వారంతా వాటిని ఇళ్లలో నిరుపయోగంగా ఉంచేసుకున్నారు. తొలి ఏడాది రీఫిల్ చేయించి వదిలేసిన వారు కొందరైతే, ఒక్కసారి మాత్రమే రీఫిల్ చేయించిన వారు మరికొందరు ఉన్నారు. అసలే రీఫిలింగ్ చేయించని వారు ఇంకొందరు కూడా ఉన్నారు.
గత ఆర్ధిక సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య కోరుతూ దాఖలైన ఓ సమాచార హక్కు చట్టం దరఖాస్తుపై కేంద్రం వివరాలు వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో PMUY లబ్ధిదారులకు 2020 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం మూడు ఉచిత సిలెండర్లను ఇచ్చింది. ఆ తర్వాత దీన్ని డిసెంబర్ వరకూ పొడిగించింది. దీని ప్రకారం చూసినా లోక్సభలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అదే సమాధానం ప్రకారం లబ్ధిదారులు దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14.17 కోట్ల ఉచిత రీఫిల్లను పొందారు. ఇది కూడా సాధారణ రీఫిల్స్ పై ప్రభావం చూపింది.
గతేడాది షాకింగ్ గణాంకాలు
గత ఆర్థిక సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో 90 లక్షల మంది లబ్ధిదారులు తమ సిలిండర్లను అస్సలు రీఫిల్ చేయలేదు.అలాగే కోటి మంది లబ్ధిదారులు తమ సిలిండర్లను ఒక్కసారి మాత్రమే రీఫిల్ చేసుకున్నారు. మూడు చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)లకు కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టిఐ) దరఖాస్తుకు సమాధానంగా ఈ విషయం వెల్లడైంది.
చమురు సంస్ధల వారీగా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్చి 2021 వరకు విడుదల చేసిన కనెక్షన్ల పరంగా చూసుకుంటే గత ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల మంది వినియోగదారులు తమ కనెక్షన్లను రీఫిల్ చేయలేదు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ 9.1 లక్షలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 15.96 లక్షల వినియోగదారులు రీఫిల్ చేసుకోలేదు.
ఉజ్వల యోజనలో మొదటి రౌండ్ అయిన సెప్టెంబర్ 2019 వరకు విడుదల చేసిన కనెక్షన్లే ఇందులో 15.96 లక్షలు అని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు ఒక్కసారి మాత్రమే సిలిండర్లు నింపిన కస్టమర్ల సంఖ్య 52 లక్షలుగా నమోదైంది.
అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కు 27.58 లక్షలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్కు 28.56 లక్షలు ఉన్నాయి. వాస్తవానికి లోక్సభలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ ఏడాది మార్చిలో ఉజ్వల యోజన కింద ఎల్పిజి వినియోగం సంవత్సరానికి 3.66 రీఫిల్స్గా ఉంటుందని తెలిపింది.