పవన్ నిలదీత, టీ గుర్రు: కేంద్రం మెడకు చుట్టుకుంటుందా?
గత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ - తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా నిలిచిన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కేంద్రం తీరును నిలదీశారు.
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ఇప్పుడు నేరుగా ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికే చుట్టుకుంటున్నది.
సమాజ్ వాదీ పార్టీ - కాంగ్రెస్ కూటమి, మాయావతి సారథ్యంలోని బీఎస్పీని ఎదుర్కొని విజయం సాధించేందుకు తమకు అధికారమిస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని పదేపదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంవైపు చూడడం మొదలుపెట్టాయి.
బీజేపీ అంచనాలకు మించి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి రికార్డు నెలకొల్పింది. దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ ప్రజలు తమకు నీరాజనాలు పలకడంతో భవిష్యత్లోనూ వారు తమ వెంట సాగేలా ఈ ఆకర్షణీయ పథకం అమలు చేయబూనుకున్నట్లు తెలుస్తున్నది.
కేంద్రం ఆ భారం మోస్తుందన్న కేంద్ర మంత్రి రాధామోహన్
‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తుంది. కనుక ఆ ప్రభుత్వంపై పడే అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది' అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గురువారం లోక్సభలో చెప్పినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలు రాష్ట్రాల్లో తమ ఆర్థిక అవసరాలు.. తమ ప్రజల అభ్యున్నతి పట్ల మరిన్ని ఆశలు రేకెత్తించాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బారాన్ని మాత్రమే ఎందుకు భరిస్తారని, తమ సంగతేమిటని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీయడం మొదలుపెట్టాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
జైట్లీతో తమిళనాడు మంత్రి జయకుమార్ చర్చలు
యూపీ రైతులకు పంట రుణాల హామీ అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మీడియాలో వార్త రాగానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తమిళనాడు మంత్రి జయకుమార్ ఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. రైతు ఆత్మహత్యలు అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో రూ.30,500 కోట్ల మేర పంట రుణాలు మాఫీ చేయాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. దీనిపై అన్ని రాష్ట్రాలకు వర్తింపజేసేలా జాతీయ పథకాన్ని రూపొందించాలని సూచించారు. పేద రైతులను ఆదుకునేందుకు ఒక పథకంతో ముందుకొస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనకు హామీ ఇచ్చారని దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత వెల్లడించారు. తీవ్ర కరువును ఎదుర్కొంటున్న తమిళనాడు రైతులకూ కేంద్రం సాయం అందించాలని మంత్రి జయకుమార్ జైట్లీని కోరారు.
విడతల వారీగా రుణ మాపీ అమలు ఇలా..
2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ రైతు రుణ మాఫీ పథకాలు ప్రకటించాయి. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) చుక్కలు చూపింది. జాతీయ స్థాయిలో రుణ మాఫీ పథకం అమలు సాధ్యమవుతుందే తప్ప.. రాష్ట్రాల వారీగా అసాధ్యమని తేల్చేసింది. దీనిపై చర్చోపచర్చల తర్వాత విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాల నుంచి చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో చివరి కిస్తు రుణ మాఫీకి నిధులు కేటాయించినట్లు వార్తలొచ్చాయి.
తమ సంగతేంటంటున్న తెలుగు ప్రజలు
గత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ - తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా నిలిచిన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కేంద్రం తీరును నిలదీశారు. కేవలం ఉత్తర భారత ప్రజల బాగోగులు మాత్రమే కేంద్రం పట్టించుకుంటుందా? అని ప్రశ్నించారు. తమ సంగతేమిటని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
పంజాబ్ పరిస్థితి ఇలా
ఇక రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తర్వాత పంజాబ్ రాష్ట్రం నిలుస్తుంది. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో విజయం సాధించడంతోపాటు ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం పీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోపాటు రెండో స్థానంలో నిలిచిన ఆమ్ఆద్మీ పార్టీ మొదలు ఓటమి పాలైన శిరోమణి అకాలీదళ్ - బీజేపీ కూటమి కూడా తమను గెలిపిస్తే రుణమాపీ చేస్తామని హామీలు గుప్పించాయి. తాజాగా కేంద్ర ప్రకటన నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా దీనిపై ద్రుష్టి సారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఆత్మరక్షణలో కేంద్రం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతుల రుణ మాఫీ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది'' అని గురువారం మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించినట్లు పీటీఐ వార్తా సంస్థ స్పష్టంగా చెబుతూ కథనాన్ని ఇచ్చింది. కేంద్ర మంత్రి తాను అలా అనలేదని చెప్పకుండానే, పీటీఐ వార్తా సంస్థ ద్వారా ‘సవరణ'లు పంపారు. ‘యూపీలో బీజేపీ ఇచ్చిన హామీని. ఆ రాష్ట్రంలో ఏర్పాటయ్యే బీజేపీ సర్కారే అమలు చేస్తుంది. ఇతర రాష్ట్రాలు కూడా వ్యవసాయ రుణ మాఫీని అమలు చేస్తే స్వాగతిస్తాం' అని కేంద్ర మంత్రి అన్నారని పీటీఐ తెలిపింది.
ఏపీ, తెలంగాణకూ వర్తిస్తుందా?
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ రాజ్యసభలో రుణ మాఫీ అంశాన్ని ప్రస్తావించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. రైతులను ఆదుకునే స్కీంలు అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తామని అన్నారు. అంటే ఇప్పటికే రుణ మాఫీ అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా వర్తింపజేస్తారా? లేదా? అన్న విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.