సరిహద్దుల్ని చైనా గుర్తించట్లేదని మీరెలా చెబుతారు? - రాజ్నాథ్ ప్రకటనపై విపక్షం ఫైర్
చైనాతో సరిహద్దు వివాదాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటన గందరగోళంగా ఉందని, చర్చలు జరుగుతోన్న కీలక తరుణంలో ''సరిహద్దుల్ని చైనా గుర్తించడం లేదంటూ'' ఆయన వ్యాఖ్యానించడం దేశానికి తీరని నష్టమని విపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సరిహద్దు అంశంపై చర్చకు అవకాశం లేకుండా, లోక్ సభలో రాజ్ నాథ్ ఏకపక్ష ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

గుర్తించనప్పుడు చర్చలెందుకు?
‘‘రాజ్ నాథ్ ప్రకటన మరింత గందరగోళానికి దారితీసేలా ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)పై గతంలో చేసుకున్న అంగీకారాలు, ఒప్పందాలను గౌరవిస్తూ రెండు దేశాలూ చర్చలు జరుపుతున్నాయని రక్షణ మంత్రి అంటున్నారు. మళ్లీ ఆయనే.. ఎల్ఏసీని చైనా గుర్తించడం లేదని, సరిహద్దులపై దాని అభిప్రాయాలు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు వాక్యాలు పరస్పరం భిన్నమైనవి. అలాంటప్పుడు మనం స్టేటస్ కో కోసం పట్టుపట్టడంలో అర్థముంటుందా?'' అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు.

మోదీ ప్రకటన పచ్చి అబద్ధం..
భారత భూభాగంలో ఇంచు కూడా ఇతరుల ఆధీనంలో లేదంటూ ప్రధాని మోదీ బీరాలు పోయారని, రాజ్ నాథ్ ప్రకటనతో చైనా ఆక్రమణ నిజమేనని తేలిందని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరి అన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్టు తాము గతంలో చెప్పినా.. అబద్ధాలతో మభ్యపెట్టిన మోడీ ప్రభుత్వం ఇప్పడు అసలు నిజాలు భయటపెడుతుందని.. కాంగ్రెస్ ప్రశ్నలను ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టే చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం వెనుకాడుతోందని అధిర్ మండిపడ్డారు.

నాడు వాజపేయి అడిగితే..
‘‘1962 యుద్ధం సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి.. సరిహద్దు అంశాలపై సభలో చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ మేరకు నాటి ప్రధాని నెహ్రూ.. రెండు రోజుల పాటు చర్చ నిర్వహించారు. అదే సంప్రదాయాన్ని మోదీ సర్కారు కూడా కొనసాగించాలి. రూల్ 190 కింద నేను రెండు సార్లు నోటీసులు ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. సరిహద్దులో మన ధైర్య సైనికులపై తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ సభకు ఎందు రాలేదు? అబద్ధపు ప్రకటన చేశాననే భయం సిగ్గుతోనా? లేక కాంగ్రెస్ నిలదీస్తుందన్న భయంతోనా?'' అని కాంగ్రెస్ నేత ఫైరయ్యారు.

భారత్ సహనాన్ని పరీక్షించొద్దు..
చైనా విషయంలో మోదీ సర్కార్ భారత ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నదని, ప్రతిసారి సైనికులకు అండగా ఉన్నామంటూ నామమాత్రపు ప్రకటనలే తప్ప.. నిజంగా సేనలకు మద్దతుగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదని కాంగ్రెస్ యువ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. లదాక్ లో చైనా సేనలు మన భూభాగంలోకి మరింత చొచ్చుకురాక మునుపే.. మన సైన్యానికి బలమైన సంఘీభావాన్ని ప్రకటిస్తూనే చైనాకు గట్టి వార్నింగ్ ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications