కేంద్ర మంత్రి వర్గ విస్తరణ: ప్రధాని మోడీ టీమ్ 66
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ఘనంగా జరిగింది. తాజా విస్తరణలో 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య 66కు చేరింది.
గత మే మే నెలలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ, 44 మందిని తన కేబినెట్లో సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో మోడీ సహా మొత్తం సభ్యుల సంఖ్య నిన్నటిదాకా 45 గా ఉంది. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి నిన్నటిదాకా నాటి కేబినెట్ సభ్యులతోనే పాలన సాగించారు మోడీ.
తాజాగా ఈరోజు (ఆదివారం) తన మంత్రివర్గాన్ని విస్తరించారు. దీంతో ప్రస్తుతం ప్రధాని మోడీ కేబినెట్లో మంత్రుల సంఖ్య 66కు చేరింది. నరేంద్ర మోడీ తొలి మంత్రివర్గ విస్తరణలో నలుగురికి మాత్రమే కేబినెట్ హోదా దక్కింది.
ముగ్గురు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా ప్రమాణం చేయగా, 14 మంది సహాయ మంత్రులుగా పదవులు చేపట్టారు. ఇక ఈరోజు మోడీ సర్కారులో మంత్రిగా ప్రమాణం చేసేందుకు డిల్లీ వెళ్లిన శివసేన ఎంపీ అనిల్ దేశాయ్, పదవి చేపట్టకుండానే వెనుదిరిగారు.
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు శివసేన ఎంపీలకు మంత్రిపదవులిస్తామని బీజేపీ ప్రతిపాదించింది. దీంతో అనిల్ దేశాయ్కి కేబినెట్ హోదా, సురేశ్ ప్రభుకు సహాయ మంత్రి పదవులివ్వాలని ఉద్ధవ్ థాకరే, ప్రధాని మోడీకి సూచించారు.
అయితే ఇందుకు భిన్నంగా సురేశ్ ప్రభుకు కేబినెట్ హోదా, అనిల్కు సహాయ మంత్రి పదవి ఇస్తున్నారన్న సమాచారంతో ఉద్ధవ్ థాకరే కోపోద్రుక్తుడయ్యాడు. వెంటనే అనిల్కు ఫోన్ చేసిన ఉద్ధవ్, తిరిగొచ్చేయమని ఆదేశాలు జారీ చేశారు. మోడీ తీరుపై ఉద్ధవ్ థాకరే సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేకంగా భేటీ అవనున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా... తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. సాయంత్రంలోగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులతో పాటు ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ శాఖల బాద్యతలు పర్యవేక్షిస్తున్న మంత్రుల శాఖల పునర్వ్యస్థీకరణ జరగనుంది.