కిచిడీనే కాదు, చైనాకు షాకిచ్చే పనికూడా!: ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ ఆన్లైన్ సమ్మిట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తో గురువారం ఆన్లైన్లో జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఆసక్తికరంగా సాగాయి. ఆస్ట్రేలియాతో భారత్కు స్నేహపూర్వక సంబంధాలున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలుచుకుందామని పిలుపునిచ్చారు.

సంక్షోభం అవకాశంగా..
కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా బయటపడాలని ఆకాంక్షించారు.
ఈ సంక్షోభ సమయాన్ని అవకాశంగా మలుచుకుందామని పిలుపునిచ్చారు.
భారత్, ఆస్ట్రేలియా పరస్పరం సహకారంతో ఎదుగుతాయన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ మాట్లాడుతూ.. ఇండో పసిఫిక్ రిజీయన్లో పరస్పరం కలిసి పనిచేద్దామన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ, శాస్త్ర, సాంకేతిక ఒప్పందాలు సంతోషకరమన్నారు. ఈ సమావేశం ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని స్కాట్ మోరిసన్ ఆకాంక్షించారు.

మోడీ కోసం కిచిడీ చేస్తానంటూ మారిసన్..
అంతేగాక, వీరి మధ్య ఆసక్తికర సంభాషణ కూడా జరిగింది. ఈసారి తాను మోడీ కోసం స్వయంగా గుజరాతీ కిచిడీ చేస్తానని ఈ వీడియో కాన్ఫరెన్స్లో మారిసన్ వెల్లడించారు. అంతేగాక, భారత ప్రధాని ఆలింగనాన్ని మిస్ అవుతున్నానని అన్నారు. ట్రేడ్మార్క్ మోడీ ఆలింగనం కోసం అక్కడ ఉండాలనుకుంటున్నాను. నేను చేసిన సమోసాను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గత ఆదివారం అది మన మధ్య జరిగిన సంభాషణకు దారితీసింది. ఈసారి మీకోసం గుజరాతీ కిచిడీ చేస్తాను .అది మీకు ఇష్టమైన వంటకమని గతంలో నాతో చెప్పారు. తర్వాత మనం కలిసినప్పుడు ఆ కిచిడీ మీకు రుచిచూపిస్తాను అని మోడీతో మారిసన్ వ్యాఖ్యానించారు.

మీ సమోసాపై భారత్ చర్చంటూ మోడీ..
మారిసన్ ఆఫర్కు అంగీకరించిన ప్రధాని మోడీ స్పందిస్తూ.. మీరు చెప్పినది సంతోషంగా ఉంది. మీరు తయారు చేసిన సమోసా గురించి మా దేశంలో చాలా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కిచిడీ గురించి ప్రస్తావించారు. ఇది గుజరాతీలకు సంతోషం కలిగిస్తుంది. చాలా గుజరాతీ కుటుంబాలు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాయి. ఆ వంటకానికి భారత్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉన్నా.. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ప్రధాని వివరించారు.

కుటుంబంతోపాటు భారత్ రండి.. మోడీ ఆహ్వానం
కరోనా మహమ్మారిపై విజయం సాధించిన తర్వాత కలిసి సమోసాలను, కిచిడీని ఆస్వాదిద్దామని మారిసన్తో మోడీ అన్నారు. కుటుంబంతోపాటు భారత్ను సందర్శించాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. మారిసన్ను ఆహ్వానించారు. కరోనా అనంతరం తప్పకుండా వస్తామని మారిసన్ చెప్పారు. కాగా, గత కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ సమోసా, మామిడీ చట్నీని తయారు చేసి ట్విట్టర్లో షేర్ చేసి, ప్రధాని మోడీ ఖాతాను ట్యాగ్ చేశారు. అంతేగాక, సండే సమోసా విత్ మ్యాంగో చట్నీ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మోడీ స్పందిస్తూ.. హిందూ మహాసముద్రంతో కలిశాం.. భారతీయ సమోసాతో ఏకమయ్యాం అని బదులిచ్చారు.
చైనాకు చెక్ పెట్టే యత్నం..
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా మద్దతు మన దేశానికి ఎంతో కీలకంగా మారింది. ఇప్పటికే చైనాకు వ్యతిరకంగా వ్యవహరిస్తూ భారత్కు మద్దతు తెలుపుతున్న అమెరికాకు ఆస్ట్రేలియా సానుకూలంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే కొన్ని దీవుల్లో నావెల్ బేస్ లను ఏర్పాటు చేసుకుంటోంది చైనా. అయితే, దీన్ని దక్షిణి కొరియా, వియాత్నం, జపాన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆస్ట్రేలియా కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా చైనా వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో దక్షిణి కొరియా, వియాత్నం, జపాన్ దేశాలతోపాటు ఆస్ట్రేలియా మద్దతు కూడా కీలకంగా మారింది. అందుకే మోడీ ముందు చూపుతో ఆస్ట్రేలియాతో దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications