21మంది వీరే..: దత్తాత్రేయకి స్వతంత్ర, సుజనకి సహాయ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం మధ్యాహ్నం స్వతంత్ర హోదా సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కొత్త జట్టు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది.
అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరిలతో పాటు గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తదితరులు ఉన్నారు. మోడీ తన మంత్రివర్గాన్ని తొలిసారి విస్తరిస్తున్నారు. రాష్ట్రపతి దర్బార్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కేబినెట్ మంత్రులుగా నలుగురు, స్వతంత్ర హోదా సహాయమంత్రిగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో...
మనోహర్ పారికర్ - గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఈశ్వరుడి పైన శపథం చేశారు. పారికర్ ముంబై ఐఐటీలో విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటి నుండి ఆరెస్సెస్ నేత. గోవా నుండి తొలిసారి కేంద్రమంత్రి అయ్యారు.
సురేష్ ప్రభాకర్ ప్రభు - సురేష్ ప్రభాకర్ ప్రభు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వాజపేయి మంత్రివర్గంలో కీలక శాఖను చేపట్టారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ఈయన శివసేన సీనియర్ నేత.
జగత్ ప్రకాశ్ నడ్డా - హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడు. హిమాచల్ ప్రదేశ్ మంత్రిగా పని చేశారు. బీఏ, ఎల్ఎల్బీ చదివారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.
బీరేంద్ర సింగ్ - కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన నేత. హర్యానా రాజకీయాల్లో బీరేంద్ర సింగ్ కుటుంబం చాలా కీలకం.
బండారు దత్తాత్రేయ - స్వతంత్ర హోదా సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సికింద్రాబాద్ నుండి నాలుగోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. విద్యార్హత బీఎస్సీ. గతంలో రెండుసార్లు కేంద్రమంత్రిగా ఉన్నారు.
రాజీవ్ ప్రతాప్ రూఢీ - కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా). షెరాన్ (బీహార్) నుండి లోకసభకు ఎన్నికయ్యారు. వాజపేయి హయాంలో పౌరవిమానయాన మంత్రిగా ఉన్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు.
మహేశ్ శర్మ - స్వతంత్ర హోదా సహాయమంత్రి
ముక్తార్ అబ్బాస్ నక్వీ - ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. అలహాబాద్ వర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షుడు. వాజపేయి హయాంలో మంత్రిగా పని చేశారు.
రామ్ కృపాల్ యాదవ్ - రాజ్యసభ సభ్యుడు. మూడుసార్లు లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. ఇతను మాజీ ఆర్జేడీ నేత.
కల్నల్ సోనారామ్ చౌదరీ - కేంద్రమంత్రిగా కల్నల్ సోనారామ్ చౌదరి ప్రమాణ స్వీకారం
రామ్ శంకర్ కటేరియా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం
సన్వర్ లాల్ జాఠ్ - రాజస్థాన్లోని అజ్మీర్ ఎంపీ. రాజస్థాన్ అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిథ్యం వహించారు.
మోహన్ బాయి కళ్యాణ్ బాయి కుందారియా - ప్రమాణ స్వీకారం చేశారు.
గిరిరాజ్ సింగ్ - నవద ఎంపీ, బీహార్ బీజేపీ కీలక నేత.
హన్సరాజ్ గంగారామ్ అహిర్ - చంద్రాపూర్ (మహారాష్ట్ర) ఎంపీ. రెండుసార్లు అహిర్ ప్రాతినిథ్యం వహించారు. బొగ్గు కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన అహిర్.
సుజనా చౌదరి - టీడీపీ పార్లమెంటరీ నేత. ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ. టీడీపీ ముఖ్య నేత.
జయంత్ సిన్హా - గిరిద్ (జార్ఖండ్) ఎంపీ. యశ్వంత్ సిన్హా తనయుడు. ఢిల్లీ ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ - జైపూర్ గ్రామీణ నుండి లోకసభకు గెలుపొందారు. 2013లో బీజేపీలో చేరారు. ఇతను ప్రముఖ షూటర్. 2004 ఒలింపిక్ రజత పతకం విజేత.
బాబు శుక్లా బబుల్ సుప్రియో - అసాన్ సాల్ (పశ్చిమ బెంగాల్) ఎంపీ. బెంగాల్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక బీజేపీ ఎంపీ. ప్రముఖ గాయకుడు.
సాధ్వీ నిరంజన్ జ్యోతి - పతేపూర్ (యూపీ) నుండి లోకసభకు ప్రాతినిథ్యం. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రముఖ సామాజిక కార్యకర్త.
విజయ్ సంప్లా - హోషఇయార్పూర్(పంజాబ్) నుండి లోకసభకు ప్రాతినిథ్యం. పంజాబ్ బీజేపీలో కీలక నేత. అంచెలంచెలుగా ఎదిగారు.