"ముమ్మాటికీ ఇది మోడీ కుట్రే!, ఆ సహాయం మరిచిపోయి అద్వానీని బలిచేశాడు"
రాష్ట్రపతి రేసు నుంచి అద్వానీని తనకు తానుగా తప్పుకునేలా చేసేందుకే మోడీ ఈ కుట్ర పన్నారని లాలూ ఆరోపించారు.
పాట్నా: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత అద్వానీని సుప్రీం కోర్టు పునర్విచారణకు ఆదేశించిడం పట్ల 'మోడీ' చుట్టే అనుమానాలు ముసురుకొనడం గమనార్హం. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సైతం ఇదే అనుమానాన్ని లేవనెత్తారు.
రాష్ట్రపతి రేసు నుంచి అద్వానీని తనకు తానుగా తప్పుకునేలా చేసేందుకే మోడీ ఈ కుట్ర పన్నారని లాలూ ఆరోపించారు. ప్రధాని చేతిలో ఉండే సీబీఐ బాబ్రీ మసీదు కేసులో అద్వానీకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో వాదించడం ముమ్మాటికీ మోడీ కుట్రే అన్నారు.
అద్వానీయే కాబోయే రాష్ట్రపతి అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. పోటీ నుంచి అద్వానీని తప్పించేందుకే మోడీ రాజకీయంగా కుట్రపూరిత ధోరణితో వ్యవహరించారని లాలూ మండిపడ్డారు. అద్వానీ విషయంలో జరుగుతున్న పరిణామాలను ఎవరైనా సులువుగానే అర్థం చేసుకోగలరని అన్నారు.
2002లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు తనను అద్వానీయే కాపాడారన్న కనీస విశ్వాసం కూడా మోడీకి లేకుండా పోయిందన్నారు లాలూ. అప్పట్లోనే సీఎం పదవి నుంచి మోడీని తొలగించాలని వాజ్ పేయి భావించినప్పటికీ.. అద్వానీ ఆయనకు సర్దిచెప్పారని.. కానీ మోడీకి ఆ విశ్వాసం కూడా లేదని లాలూ ఘాటుగానే వ్యాఖ్యానించారు.