అలా మాట్లాడుతారా?: 'మోడీ విదేశాల్లో దేశం పరువు తీశారు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో భారత దేశం పరువు తీశారని కాంగ్రెస్ పార్టీ గురువారం నిప్పులు చెరిగింది. భారతదేశంలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వ్యవస్థను పాడు చేసి వెళ్లి పోయాయంటూ ప్రధాని మోడీ కెనడా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
విదేశీ గడ్డపై మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని ఇంత తక్కువ చేసి మాట్లాడటం ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తికి సరికాదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం హ్యాంగోవర్ నుంచి మోడీ బయటకు రాలేదన్నారు. భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధానీ విదేశీ గడ్డపై దేశం గురించి ఇలా మాట్లాడలేదన్నారు.
దేశంలో మొన్నటి వరకు అవినీతి రాజ్యమేలిందని ఎటుచూసినా కుంభకోణాలే ఉండేవని మోడీ మాట్లాడటం ప్రధాని హోదాకు సరైంది కాదన్నారు. దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఎందరో మహనీయులను మోడీఅవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశ జీడీపీ 4రెట్లు పెరిగిన విషయాన్ని మోడీ మరిచిపోయారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి విద్వేష పూరితంగా వ్యాఖ్యలు చేశారని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మోడీ తీరు ప్రధాని కార్యాలయాన్ని తక్కువ చేసినట్లుగా ఉందన్నారు.