మోడీ, షా స్నేహాన్ని ఇలా విడదీయొచ్చు..! కిటుకు చెప్పిన బీజేపి ఎంపీ..!!
ఢిల్లీ/హైదరాబాద్ : మర్రి చెట్టు ఊడళ్లా బలంగా పాతుకుపోయిన మోదీ-అమీత్ షా మద్యన చిచ్చు పెట్టొచ్చా అంటే అవును పెట్టొచ్చు అనే ఆశ్చర్యకర సమాధానం బీజేపి నుండే వినిపిస్తోంది. మోదీ, షా ద్వయం, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు, అందరు నేతలకు చెక్ పెడుతున్నారు. మరి, వీరిద్దరికి చెక్ పెట్టగల సమర్థులెవరు ? అసలున్నారా ? ఎక్కడున్నారు ? వారెవరు ? 'ఔను.. నేనున్నాను ' అంటూ చెయ్యెత్తుతున్నారు ఆ నేత. ఇంతకీ, ఆ నేత ఎవరు... ? ఏ పార్టీ...? ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆయన కూడా బీజేపీ నేతనే. ఆయన మరెవరో కాదు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు, సుబ్రమణ్యస్వామి. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో ఊహించటం చాలా కష్టం.
సొంత పార్టీ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేసే సత్తా మాత్రమే కాదు.. తాను ఒకసారి ఒక మాట అన్నాక.. దాని గురించి పార్టీ నేతలు సైతం వేలెత్తి చూపించే సాహసం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే, ఆయనను టచ్ చేస్తే మరింత డ్యామేజీ జరగడం ఖాయం. స్వతంత్ర భావాలు మెండుగా గల సుబ్రమణ్యస్వామి, రాజకీయంగా ఒకరిని అదే పనిగా పొగిడేయడమనేది ఏమాత్రం ఇష్టముండదు.

తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్న ఆయన మాటలు ఒక ఎత్తయితే.. మోడీ, షా ద్వయానికి సరైన ప్రత్యామ్నాయం ఎలా ఉండాలో చెప్పటం మరో ఎత్తు. 'ఒకే దేశం.. ఒకే పార్టీ' అంటున్న, మోడీ-షా ద్వయం తీరును సుబ్రమణ్యస్వామి తప్పుబట్టారు. గోవా, కర్ణాటక పరిణామాలు చూశాక.. దేశంలో బీజేపీ ఒక్కటే ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వనాశనమవుతుందేమోనని భయమేస్తోందని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, బీజేపీకి ప్రత్యామ్నాయం కూడా చూపించారు. ''కాంగ్రెస్ పార్టీ నాయకత్వ స్థానం నుంచి సోనియాను, ఆమె సంతానాన్ని పక్కన పెట్టాలి. మమతా బెనర్జీ తన పార్టీ టీఎంసీని కాంగ్రెసులో విలీనం చేయాలి. అప్పుడు, కాంగ్రెస్ పార్టీ పగ్గాలను మమతాబెనర్జీ చేపట్టాలి. శరద్ పవార్ కూడా తన పార్టీ ఎన్సీపీని కాంగ్రెసులో కలిపేయాలి'' అని సూచించారు. మరి, సుబ్రమణ్యస్వామి ఆలోచనపై అటు సోనియా, ఇటు మమత ఎలా స్పందిస్తారో చూడాలి. దానికన్నా ముందు మోదీ,అమీత్ షా రియాక్షన్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications