మోడీ-షాపై వచ్చిన ఫిర్యాదులపై మే 6లోగా నిర్ణయం తీసుకోండి: ఈసీకి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లి: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు ఈసీకి మే 6న డెడ్లైన్ విధించింది సుప్రీంకోర్టు. ఇద్దరు పోల్కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ 11 ఫిర్యాదులు చేసింది. మొత్తం 11 ఫిర్యాదులు తమ దృష్టికి రాగా రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని ఇంకా 9 ఫిర్యాదులపై డిసైడ్ చేయాల్సి ఉందని కేసును విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దృష్టికి ఈసీ తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఇతర అభ్యర్థులపై చేసిన ఫిర్యాదులు 40 ఉండగా అందులో 20 వాటిపై మీదే ఈసీ చర్యలు తీసుకుందని కోర్టు దృష్టికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం మే 6లోగా అంటే రానున్న సోమవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవీ ఈసీ చర్యలు తీసుకోలేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరపున కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇక ఎన్నికల ప్రచారంలో నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటికే నాలుగు దశలు పూర్తి కాగా ప్రచారం సందర్భంగా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్, మాయావతి లాంటి నేతలను కొన్ని గంటలపాటు ప్రచారానికి దూరంగా ఉండాలంటూ కూడా ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.