పిట్రోడా వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం.. కాంగ్రెస్ వైఖరిని కడిగిపారేసిన ప్రధాని..
ఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. జరగాల్సింది జరిగిపోయిందన్న ఆయన కామెంట్లపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ వ్యక్తిత్వం ఆలోచనా విధానానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ప్రధాని మోడీ విమర్శించారు. తాను చేసిన వ్యాఖ్యలకు పిట్రోడా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నేను రేసులో లేను.. ప్రధాని పదవిపై ఆశలేదు..
కాంగ్రెస్ వ్యక్తిత్వానికి నిదర్శనం
1984లో జరిగిందేదో జరిగిపోయిందని,అయితే ఇప్పుడేంటన్న శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఘాటుగా స్పందించారు. హర్యానాలోని రోహ్తక్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ వైఖరి, ఆలోచనా విధానాలకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎంత స్పృహలేకుండా వ్యవహరించిందో అర్థమవుతోందని విమర్శించారు.
పిట్రోడాపై వేటు వేస్తారా?
సిక్కుల ఊచకోతపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సైతం ఘాటుగా స్పందించారు. చేసిన తప్పుకు కాంగ్రెస్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. ఇలాంటి అభిప్రాయం కలిగిన ఉన్న గురువును పార్టీ నుంచి బహిష్కరిస్తారా? అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని జైట్లీ ప్రశ్నించారు. ఇలాంటి పాపాలు చేసిన కాంగ్రెస్ హంతకులను ఎన్నటికీ క్షమించదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు.
జరిగిందేదో జరిగిందన్న పిట్రోడా
1984 సిక్కుల ఊచకోతకు ప్రధాని రాజీవ్గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయంటూ బీజేపీ చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. దీనిపై స్పందించిన శ్యామ్ పిట్రోడా అప్పుడేం జరిగిందన్న విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం చేశారో దాని గురించి మాట్లాడండని అన్నారు. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దుమారం రేగింది.