ఎక్కడ్నుండి తెస్తావ్: కేజ్రీకి మోడీ చురక, సీఎం ఇంటి ఎదుట ఆందోళన
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలు ప్రస్తావిస్తున్న ఉచిత విద్యుత్తు గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఓ సదస్సులో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి ఉచిత విద్యుత్ ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు. సాధారణంగా ఏ రాష్ట్రాల్లో విద్యుదుత్పత్తి సదుపాయం లేదో ఆ రాష్ట్రాలే ఈ రోజుల్లో ఉచిత విద్యుత్ గురించి హామీ ఇస్తున్నాయని, పొరుగు రాష్ట్రాలపై ఆధారపడిన వారు ఎక్కడి నుండి ఆ విద్యుత్ తీసుకు వస్తారని మోడీ ప్రశ్నించారు.
ఉత్పత్తి లేకుండా ఉచితంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లులు ఎలా తగ్గిస్తారో చెప్పాలన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విపక్షాలు అన్నీ ఏఏపీకి మద్దతు పలికిన నేపథ్యంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తొలిసారి కేజ్రీవాల్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ ఇంటి ఎదుట గుడిసెవాసుల ఆందోళన
కేజ్రీవాల్ ఇంటి ఎదుట ఆదివారం కొందరు ఓ బృందంగా ఏర్పడి ఆందోళన నిర్వహించారు. శనివారం ఆయన ఓ వైపు పర్యటిస్తుండగా ఛోటానగర్ ప్రాంతంలో ఎనిమిది గుడిసెలను అధికారులు.. బలవంతంగా కూల్చివేశారని బాధితులు వాపోయారు. అడ్డుకోబోయిన తమపైనా విచక్షణా రహితంగా దాడిచేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అహంకారమే ఓడించింది
హిందువులను ఐక్యం చేయడం కేవలం ప్రసంగాలతోనే సాధ్యం కాదని పాలకులను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఎద్దేవా చేశారు. కాన్పూర్లో జరుగుతున్న ఐదు రోజుల కార్యక్రమం ‘రాష్ట్ర రక్షా సంగంలో ఆదివారం ఢిల్లీ పాలకులను పరోక్షంగా విమర్శించారు.
తమ కోసం ప్రచారం చేసిన వారిని అవమానించే దశకు వారు పోయారని మోహన్ భాగవత్ బీజేపీని ఉద్దేశించి అన్నారు. అందుకే ఢిల్లీలో ఓడిపోయారన్నారు. ఢిల్లీ ఓటమిని ఆరెస్సెస్ నాగ్పూర్లో వచ్చే నెల సమీక్షిస్తుందని యూపీకి చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడొకరు చెప్పారు. ప్రస్తుతం సమాజం మొత్తం ఆరెస్సెస్ను కావాలనుకుంటోందని మోహన్ భాగవత్ అన్నారు.
ఢిల్లీలో మళ్లీ హజారే దీక్ష
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని ఓ ఊపు ఊపిన సామాజికవేత్త అన్నాహజారే ఢిల్లీ వేదికగా మరో పోరాటానికి సిద్దమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23నుంచి రెండు రోజులపాటు ఢిల్ల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు హజారే స్పష్టం చేశారు.