ముస్లీంలను మోడీ ఎలా టార్గెట్ చేస్తున్నారంటే!: అల్ఖైదా షాక్
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా ముస్లీంలను లక్ష్యంగా చేసుకున్నారని తీవ్రవాద సంస్థ అల్ ఖైదా చెబుతోంది. అల్ ఖైదా తొలిసారిగా ప్రధాని మోడీ పేరును ప్రస్తావిస్తూ వీడియోను విడుదల చేసింది. ఇది సంచలనం కలిగిస్తోంది.
దీనిని ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పరిశీలించారు. అందులో ప్రధాని మోడీ పేరును ప్రస్తావిస్తూ... ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ పాలసీల ద్వారా మోడీ పరోక్షంగా ముస్లీంల పైన యద్ధానికి సిద్ధపడ్డారని ఉంది.
ఈ వీడియోను ఈ నెల 2వ తేదీన విడుదల చేశారు. భారత ఉప ఖండ విభాగం (ఏక్యూఐఎస్ - అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంటల్) చీఫ్ మౌలానా అసీమ్ ఉమర్, ఫ్రం ఫ్రాన్స్ టు బంగ్లాదేశ్ - ది డస్ట్ విల్ నెవర్ సెటిల్ డౌన్ పేరిట విడుదల చేశారు.
ఐఎంఎఫ్ విధానాల నుంచి డ్రోన్ దాడులు, కెల్లీ లూగర్ బిల్, చార్లీ హెబ్డో రాతలు తదితరాలను వీడియోలో ప్రస్తావించాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలలో ఇటీవల రచయిత హత్యలు తమ పనేనని ఉమర్ చెప్పాడు. భారత్లో జీహాద్ జరగాలని, ఇస్లామిక్ పాలన తెచ్చి, షరియా చట్టాలు అమలు చేయడమే తమ లక్ష్యమన్నాడు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముస్లీంల పైన యుద్ధం కొనసాగుతోందన్నాడు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ పాలసీలు, చార్లీ హెబ్టో వంటి రాతల ద్వారా జరుగుతున్నాయన్నాడు. ఇందులో పలువురు హిందూ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాడు.