మోడీపై మమతా, కేజ్రీ ఆగ్రహం, నవ భారత్ పుట్టింది.. హ్యాట్సాప్ అన్న రజినీకాంత్
న్యూఢిల్లీ: రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు స్పందించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ఆమె ట్విట్టర్లో స్పందించారు.
ఇది ఒక అవివేకంతో తీసుకున్న నిర్ణయమన్నారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో విఫలమవ్వడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నారన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో మోడీ విఫలమయ్యారని, ఈ ఆకస్మిక తప్పుడు నిర్ణయంతో సామాన్య ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందన్నారు.
మమతా బెనర్జీ చేసిన ట్వీట్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. కేంద్రం అవివేకంతో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న మమతా ట్వీట్ చేయగా దాన్ని కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. మరోవైపు, మోడీ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.
ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం పైన సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్పందించారు. మోడీకి హ్యాట్సాప్ అన్నారు. కొత్త భారత్ పుట్టిందని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు.