మెడికోలా? సైకోలా?: కోతిని కట్టేసి చిత్రహింసలు, కత్తితో పొడిచి చంపారు
వెల్లూరులోని క్రిష్టియన్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో మెడిసిన్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఓ కోతి పిల్లను కాళ్లు కట్టేసి, బెల్టుతో కొట్టి చిత్రవధకు గురిచేశారు.
వెల్లూరు: వారు వైద్యం చేసి ప్రాణాలు పోయాల్సిన విద్యను అభ్యసిస్తున్నారు. కానీ, అత్యంత కర్కశంగా ఓ జీవి ప్రాణం తీసి రాక్షసుల్లా మారిపోయారు. ఓ కోతిని అత్యంత దారుణంగా చంపేశారు వెల్లూరుకు చెందిన మెడికో విద్యార్థులు. ఈ పాశవిక ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. వెల్లూరులోని క్రిష్టియన్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో మెడిసిన్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఓ కోతి పిల్లను కాళ్లు కట్టేసి, బెల్టుతో కొట్టి చిత్రవధకు గురిచేశారు. అంతటితో ఆగకుండా దాని చర్మం చీల్చేసి ఏదో గొప్ప పని చేసినట్లుగా గంతులేసి పైశాచికంగా ప్రవర్తించారు. ఇలా కొద్దిసేపు కోతికి నరకం చూపించి, చివరికి ఆ నోరులేని మూగజీవాన్ని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశారు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి హాస్టల్ సమీపంలోని రోడ్డు పక్కన పూడ్చి పెట్టారు.
ఫేస్బుక్ ద్వారా వెలుగుచూసిన ఈ ఘటన నెటిజన్లను కలచివేసింది. ఆ నలుగురు విద్యార్థుల చర్యను తీవ్రంగా ఖండించారు. కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. చెన్నైకి చెందిన శ్రవణ్ క్రిష్ణన్ అనే జంతు ప్రేమికుడు ఈ విషయాన్ని తెలుసుకుని తీవ్రంగా బాధపడ్డాడు.
వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి కోతిని ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకుని అక్కడ తవ్వారు. గొయ్యిలో కాళ్లు కట్టేసి ఉన్న ఆ మూగజీవాన్ని చూసి ఆ కాలేజీకి చెందిన విద్యార్థులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై క్రిష్ణన్ కాలేజీ ప్రిన్సిపల్కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితులైన ఆ నలుగురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.