Monsoon Update: రుతుపవనాలు రిటర్న్-ఇక కష్టాలు మొదలు..! తేల్చేసిన ఐఎండీ..!
ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం క్రమంగా బలపడుతోంది. దీంతో భారత్ లో నైరుతి రుతుపవనాలు (Monsoon) బలహీనపడటం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే వేసవి ముగిసిపోయి వర్షాకాలం మొదలైందని సంబరపడే లోపు రుతుపవనాలు రావడం తిరిగి వెళ్లిపోవడం, అడపాదడపా పలకరిస్తుండటం చూస్తూనే ఉన్నాం. దీని వల్ల బంగాళాఖాతంలో అప్పుడప్పుడూ అల్పపీడనాలు ఏర్పడుతున్నా అవి బలపడుతున్న సూచనలు కనిపించడం లేదు. దీంతో అల్పపీడన వర్షాలు కూడా తగినంతగా కురవడం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో భారత వాతావరణ విభాగం (IMD) మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది.
సాధారణంగా అయితే దేశంలో రుతుపవనాలు ప్రస్తుతం చాలా చురుగ్గా ఉండాలి. కానీ పరిస్ధితి రివర్స్ అయి బలహీన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం రాబోయే రెండు వారాల పాటు అంటే సెప్టెంబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవన ద్రోణి మధ్య భారతదేశం మీదుగా కదలడానికి బదులుగా హిమాలయ పాదాల వద్దే స్థిరంగా ఉండిపోవడంతో ఇప్పటికే సగటు కంటే 14 శాతం తక్కువగా ఉన్న దేశవ్యాప్త వర్షపాత లోటు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

హిమాలయ పర్వతాల వెంబడి ఈశాన్య, తూర్పున కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని, కానీ ద్వీపకల్ప భారతదేశంలో మాత్రం వాతావరణం ప్రశాంతంగా కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
అటు ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ వెదర్ కూడా తన సవరించిన అంచనాలో రుతుపవన వర్షపాతం ఇప్పుడు దీర్ఘకాల సగటులో కేవలం 85 శాతం మాత్రమే ఉంటుందని తేల్చేసింది.

ఏప్రిల్లో తమ 94 శాతం అంచనాతో పోలిస్తే ఇది తక్కువ. అలాగే కరువు వచ్చే అవకాశాలు 70 శాతం ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు మిగిలిన వారాల్లో దేశంలోని నాలుగు ఏకరీతి వర్షపాత ప్రాంతాలలో అసమాన పంపిణీ ఉంటుందని స్కైమెట్ హెచ్చరించింది. బలపడుతున్న ఎల్ నినో, బలహీనపడిన హిందూ మహాసముద్ర ద్విధ్రువం కారణంగా సెప్టెంబరులో ఈ లోటు మరింత తీవ్రమవుతుందని అంచనా. తాజా పరిణామాల ప్రభావం వ్యవసాయం, ధరలపై తీవ్రంగా ఉంటుందనే హెచ్చరికలు వెలువడుతున్నాయి.














Click it and Unblock the Notifications