వాతావరణం రిపోర్ట్: ముంబైలో భారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని ముంబై జలమయమైంది. గురువారం ఉదయం నుంచి కుండపోత వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో మోకాలిలోతున నీరు నిలిచిపోయింది. ఖర్, సియోన్, వొర్లి ప్రాంతాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో జనజీవనం స్థంభించింది. మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు శని, ఆదివారాల్లో సెలవులు రద్దు చేసింది.
గురువారం నుంచి దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం అంచనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు, ఏముంబై, పుణేలలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కేరళ, లక్ష్వద్వీప్లలో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు అరేబియా సముద్రంలోని పలుచోట్ల వేటకు వెళ్లవద్దని చెప్పింది. కొంకణ్, గోవా కోస్ట్ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ సూచన ప్రకారం సెంట్రల్ అరేబియా, కోస్టల్ కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, సౌత్ ఇంటీరియల్ కర్ణాటకలోని పలు ప్రాంతాలు, గోవా, నార్త్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మరింత వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.
మహారాష్ట్ర, గోవా తీర ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉండనుంది. వాతావరణ సూచనల ప్రకారం రత్నగిరిలో భారీ వర్షాలు కురవనున్నాయి. సింధ్దుర్గ్, ముంబై, థానే, రాయగడ్, పాల్ఘర్ జిల్లాల్లో జూన్ 9వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
సెంట్రల్ అరేబియా, గోవాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. లక్నో, హర్దోలి, సితాపూర్, బారాబంకీ, ఉన్నావ్, ఆ పక్కనున్న పలు జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అత్యవసర సమయంలో ముంబైవాసులు 1916కు, ముంబై బయటివారు 1077కు ఫోన్ చేయవచ్చు.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు ఈ సీజన్లో సెంట్రల్ ఇండియాలో సాధారణ వర్షపాతం, దక్షిణాది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురవనుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దేశవ్యాప్తంగా వర్షపాతం 101 శాతం ఉటుందని తెలిపింది.