వెదర్ రిపోర్ట్: మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు
Recommended Video
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మహారాష్ట తీర ప్రాంతం, కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 6-8 వరకు మధ్య భారతదేశం, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
గంగానగర్, హిస్సార్, షాహజాన్పూర్, గోరఖ్పూర్, హిమాలయ తూర్పు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను ప్రభావం పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంపై జులై 6వరకు ఉండనుందని పేర్కొంది. జులై 7వరకు దక్షిణం వైపు పయనించే అవకాశం ఉంది.
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రుతుపవనాల కదలికల వల్ల జులై 6 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 8 నుంచి మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం కూడా ముంబై ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. ముంబై, థానే, రాయిగడ్ ప్రాంతాల్లో బుధవారం కూడా భారీ వర్షాలు కురవనున్నాయని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రానున్న 24గంటల్లో ముంబైతోపాటు పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర హర్యానా, ఛండీగఢ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కొంకణ్, గోవా, రాయలసీమ, తమిళనాడు, లక్ష్యద్వీప్, కర్ణాటక తీర ప్రాంతాల్లో రానున్న కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.