వెదర్ రిపోర్ట్: గుజరాత్ సముద్ర తీరంలో కల్లోలం, మత్స్యకారులకు హెచ్చరిక, భారీ వర్షాలు
న్యూఢిల్లీ: రుతుపవనాలు దేశం మొత్తం ఆవరించాయి. వచ్చే నాలుగు రోజుల్లో గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. సముద్రం కూడా కొంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
Recommended Video
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జులై 6 నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. జులై 6-8 మధ్య కాలంలో మధ్య భారతదేశంలోనూ వర్షాలు అధికంగా పడే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాల ప్రకారం.. అనూప్గఢ్, నేర్నల్, అలీగఢ్, బెహ్రెయిచ్, హిమాలయపాద ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడటంతో పశ్చిమబెంగాల్ తీరప్రాంతంలో జులై 6న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 7నుంచి రుతుపవనాలు దక్షిణాది ప్రాంతంలో పూర్తిగా ఆవరించనున్నాయి.
ఆరేబియా సముద్రంలో కొంత అలజడిగా మారనుంది. గుజరాత్ తీర ప్రాంతంలో వచ్చే నాలుగు రోజులు కూడా సముద్రం కొంత అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశం మొత్తం రుతుపవనాలు ఆవరించిన కారణంగా ఇతర ప్రాంతాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
ముంబై ప్రాంతంలో మంగళవారం భారీ వర్షాలు కురియడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరో రెండు రోజులపాటు కూడా ముంబైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే రుతుపవనాలు సెప్టెంబర్ 30 వరకు వెళ్లిపోనున్నాయి.