కట్టడి చేయకుంటే క్రెడిబిలిటీకి దెబ్బే: మోడీకి మూడీస్
న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్న భారతీయ జనతా పార్టీ నేతలను కట్టడి చేయడంలో విఫలమైతే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మూడీస్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి హెచ్చరించింది. కేవలం మోడీని చూసి బిజెపి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని స్పష్టం చేసింది.
ఇప్పుడు ఆ పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయని మూడీస్ అనలిటిక్స్ ‘ఇండియా ఔట్ లుక్: సెర్చింగ్ ఫర్ పొటెన్షియల్' పేరిట విడుదల చేసిన రిపోర్టులో అభిప్రాయపడింది.
ఈ విషయమై మోడీ తక్షణం స్పందించి, తన పార్టీ నేతలను అదుపు చేయాలని, లేకుంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లోనూ గౌరవాన్ని పోగొట్టుకున్న వారవుతారని, తద్వారా బిజెపికి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిపింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతంగా ఉండవచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇంకొంత మెరుగుపడి 7.6 శాతం వృద్ధికి చేరుకోవచ్చని అంచనా వేసింది. భూసేకరణ బిల్లు, జీఎస్టీ వంటి సంస్కరణల అమలులో మోడీ సర్కారు ముందడుగు వేస్తే.. జిడిపి పెరుగుతుందని వెల్లడించింది.