టెక్కీ టు శాస్త్రీ మనవడి వరకు: కేజ్రీవాల్ కొత్త రాజకీయం
న్యూఢిల్లీ: రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి)లో చేరేందుకు ప్రముఖులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యమం నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ ఇప్పుడు దేశంలో టాక్ ఆఫ్ ది పొలిటీషియన్ అయిపోయారు. ఢిల్లీలో వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీని పార్టీ స్థాపించిన ఏడాదిలోనే మట్టి కరిపించారు.
ఎఎపి విజయం వెనుక కేజ్రీవాల్ టీం సమష్టి కృషి ఉంది. కేజ్రీవాల్కు అండగా యోగేంద్ర యాదవ్, మనీష్ సిసోడియా, కుమార్ విశ్వాస్, రాఖీ బిర్లా వంటి వారు ఉన్నారు. కేజ్రీవాల్తో పాటు వారు కూడా నిత్యం పతాక శీర్షికలకు ఎక్కుతున్నారు.
ఢిల్లీలో ఎఎపి విజయం అనంతరం దేశవ్యాప్తంగా ఆ పార్టీలో మూడు లక్షల మంది చేరారు. అందులో టెక్కీలు, బ్యాంకు ఉద్యోగులు, కార్పోరేట్ ప్రముఖులు ఉన్నారు. కొందరు తమ ఉద్యోగాలను వదిలి ఎఎపిలో చేరుతున్నారు.
రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ హెడ్ మీరా సాన్యాల్ తన ఉద్యోగాన్ని వదిలి ఎఎపిలో చేరారు. ఆమె హార్వార్డ్ బిసినెస్ స్కూల్లో చదివారు. ఇన్ఫోసిస్ మాజీ బోర్డు మెంబర్ బాలకృష్ణ బుధవారం తాను ఎఎపిలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్తరీ మనువడు ఆదర్శ్ శాస్త్రీ కొద్ది రోజుల క్రితం ఎఎపి తీర్థం పుచ్చుకున్నారు. ఎఎపిలో చేరేందుకు అతను యాపిల్ సంస్థలో తన ఉద్యోగానని వదులుకున్నారు. అహ్మదాబాదుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాను కల్సారియా జనవరి 1న కేజ్రీవాల్ పార్టీలో చేరారు. కాను తన నియోజకవర్గంలో నిర్మా సిమెంట్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఎఎపి అంటే ప్రజల అధికారమని ఈయన అభివర్ణిస్తున్నారు.
సాధారణంగా రాజకీయ పార్టీల లక్ష్యం అధికారం. అయితే ఎఎపి మాత్రం దానికి విరుద్దంగా ప్రజల పార్టీగా ఎదుగుతున్నందువల్లే తాము ఆ పార్టీలో చేరుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయాలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, దానిని దూరం చేసేందుకు ఎఎపి నడుం కట్టిందంటున్నారు. ప్రజల విశ్వాసంతో ప్రజాస్వామ్యాన్ని నిర్మించడమే ఎఎపి లక్ష్యమంటుని చెబుతున్నారు.
ఎఎపికి దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. బుధవారం రోజు ఎఎపి విరాళాలు రూ.38 లక్షలకు చేరాయట. ఢిల్లీ ఎన్నికల వరకు ఎఎపికి రోజుకు ఆరు నుండి ఏడు లక్షల రూపాయలు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం రాహుల్ గాంధీ ఎఎపికి కితాబిచ్చారు. లెఫ్ట్ పార్టీ నేత ప్రకాశ్ కారత్ కూడా మాట్లాడుతూ... ఎఎపి కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీ అని చెబుతున్నారు. ఎఎపి వచ్చిన ఏడాదిలోనే అనూహ్య మార్పులు తీసుకు వచ్చిందని సీనియర్ రాజకీయ నాయకుల మాటల్లోనే అర్థమవుతోంది.