డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్మెంట్ కేసు: ఫేక్ ప్లేట్లెట్లను విక్రయిస్తున్న 10మంది అరెస్ట్!!
యూపీలో డెంగ్యూ బారిన పడిన ఒక రోగికి ప్లేట్లెట్ల కు బదులు బత్తాయి రసాన్ని ఎక్కించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం, డెంగ్యూ రోగి మృతి కేసుపై సీరియస్ గా ఫోకస్ చేసింది. తాజాగా డెంగ్యూ రోగుల కుటుంబాలకు ప్లేట్లెట్ల కు బదులుగా, రక్తంలోని ప్లాస్మా ను విక్రయిస్తున్నారని ఆరోపణలతో 10 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. డెంగ్యూ బారినపడిన రోగి, ప్లేట్లెట్లకు బదులుగా బత్తాయి రసాన్ని ఎక్కించడం వల్ల, అతను మరణించాడని ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి.
డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్మెంట్ కేసు.. అసలు నిజం తేల్చనున్న ల్యాబ్ రిపోర్టులు
అయితే నిజానికి ప్లేట్లెట్లు అని విక్రయించిన ప్యాకెట్లలో బత్తాయి రసం ఉందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఆ ప్యాకెట్ లను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. నివేదికల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. సదరు ట్రీట్మెంట్ చేసిన ఆస్పత్రిని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్లేట్లెట్లు కు బదులుగా బత్తాయి రసం ఎక్కించారు అన్న అంశం ముఖ్యంగా సోషల్ మీడియాలోనే వైరల్ అవుతుందని యూపీ పోలీసులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. ల్యాబ్ రిపోర్టులు వస్తేనే ఈ కేసులో అసలు విషయం ఏమిటో బయటకు వస్తుందని అంటున్నారు.
బ్లడ్ ప్లాస్మాను ప్లేట్ లెట్లని విక్రయిస్తున్న 10 మంది అరెస్ట్
తాము తాజాగా అరెస్ట్ చేసిన 10 మంది వ్యక్తులు బ్లడ్ బ్యాంకుల నుండి ప్లాస్మా ను తీసుకొని, వాటిని ప్లేట్లెట్లు గా రీ ప్యాకింగ్ చేస్తున్నారని తెలిపారు. ప్లాస్మా, ప్లేట్లెట్లు రెండు రక్తంలోని భాగాలే అయినప్పటికీ, డెంగ్యూ కేసులలో, డెంగ్యూ సోకిన బాధితులకు ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉండటంతో, ప్లేట్లెట్ లకు డిమాండ్ పెరిగింది. దీంతో వారు ప్లాస్మానే ప్లేట్లెట్లు గా చెప్పి విక్రయిస్తున్నారు అని ప్రయాగ్ రాజ్ జిల్లా పోలీసు చీఫ్ శైలేష్ పాండే చెప్పారు.
ప్లేట్ లెట్ల డిమాండ్ ఎక్కువ ఉండటంతో డబ్బు కోసం మోసం
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో డెంగ్యూ విపరీతంగా వ్యాపిస్తోందని, ప్లేట్లెట్ల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది అని, దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన కొందరు, ప్లాస్మానే ప్లేట్లెట్లు గా చెప్పి నిరుపేదలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో పక్కా సమాచారంతో 10 మందిని అరెస్ట్ చేశామని, ప్లాస్మా పౌచ్లతో పాటు వారి వద్ద నుండి కొంత నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బత్తాయి ట్రీట్మెంట్ కు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ వస్తేనే క్లారిటీ
అంతేకాదు ప్రయాగ్రాజ్లో అక్రమంగా రక్తాన్ని సరఫరా చేశారనే ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం 12 మందిని అరెస్టు చేశామని కూడా జిల్లా ఎస్పీ శైలేష్ పాండే తెలిపారు. ఏది ఏమైనా డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్మెంట్ కు సంబంధించిన ఆరోపణల కేసు ల్యాబ్ నుండి సదర్ ప్యాకెట్ల రిపోర్టులు వస్తే తప్ప క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఈ లోపు మరెన్ని ఫేక్ బ్లడ్ దందాలు చేస్తున్న, ఫేక్ ప్లేట్లేట్ లను విక్రయిస్తున్న గ్యాంగ్ లు పట్టుబడతాయో వేచి చూడాలి.