ఘోరం: కదులుతున్న రైల్లో గ్యాంగ్ రేప్ యత్నం.. దూకేసిన తల్లీకూతుళ్లు
రైళ్లలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కదులుతున్న రైల్లో 10-15 మంది వ్యక్తులు మూకుమ్మడిగా తల్లీకూతుళ్లపై అత్యాచార యత్నానికి పాల్పడడంతో ఆ దుర్మార్గుల చేతుల్లోంచి తప్పించుకునేందుకు వారు రైల్
కోల్కతా: రైళ్లలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కదులుతున్న రైల్లో 10-15 మంది వ్యక్తులు మూకుమ్మడిగా తల్లీకూతుళ్లపై అత్యాచార యత్నానికి పాల్పడడంతో ఆ దుర్మార్గుల చేతుల్లోంచి తప్పించుకునేందుకు వారు రైల్లోంచి కిందికి దూకేశారు.
హౌరా-జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. బాధితులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కోల్కతాకు చెందిన ఓ మహిళ(40), ఆమె కుమార్తె(15) ఢిల్లీకి వెళ్లేందుకు హౌరా-జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు.

రైలు ఎక్కినప్పట్నించీ బోగీలోని 10-15 మంది వ్యక్తులు వీరిని గమనిస్తున్నారు. హౌరాలో రైలు కదిలినప్పట్నించి తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను టీజ్ చేయడం ప్రారంభించారు.
తన కూతురి పట్ల వారి ప్రవర్తనకు విసిగిపోయిన ఆ మహిళ మధ్యలో రెండు స్టేషన్ల వద్ద రైలు ఆగినప్పుడు అక్కడి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కానిస్టేబుళ్లకు ఫిర్యాదు కూడా చేసింది.
దీంతో స్పందించిన కానిస్టేబుళ్లు వెంటనే ఆ తల్లీకూతుళ్లు ప్రయాణిస్తున్న బోగీ వద్దకు వచ్చి తనిఖీ చేశారు.
ఎవరు అతిగా ప్రవర్తిస్తున్నరంటూ వాకబు చేసి ఓ ముగ్గురు యువకుల గూబ గుయ్ మనిపించడమేకాక వారిని ఆ బోగీలోంచి దించేసి తమతోపాటు పట్టుకుపోయారు. అయితే ఓ అరగంటలోనే మళ్లీ వారు ప్రత్యక్షమయ్యారు. రైలు బయలుదేరగానే మళ్లీ అదే బోగీలోకి ప్రవేశించారు.
తమను ఆ మహిళ రైల్వే పోలీసులకు అప్పగించిందన్న కోపంతో వేధింపులు అధికం చేశారు. అడ్డుకోబోయిన ఆ మహిళతో.. 'చెప్పినట్లు వినకపోతే నీ కూతురుకి మత్తు ఇచ్చి తీసుకెళ్లి అమ్మిపారేస్తాం..' అంటూ బెదిరించారు.
రాత్రి పది గంటల సమయంలో, ఆ మహిళ కుమార్తె టాయిలెట్ కు వెళుతున్న సమయంలో నలుగురైదుగురు ఆ బాలికను అడ్డగించి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. కూతురి అరుపులు విన్న తల్లి పరుగుపరుగున అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
అప్పటికే ఆ వ్యక్తులు ఆమె కుమార్తె దుస్తులు అక్కడక్కడ చింపేయడంతో వారిబారి నుంచి ఎలా తప్పిచుకోవాలో అర్థం కాక తల్లీకూతుళ్లిద్దరూ నడుస్తున్న రైల్లోంచి కిందికి దూకేశారు. అప్పటికి వారెక్కిన రైలు చందారి-కాన్పూర్ స్టేషన్ల మధ్య నడుస్తోంది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లు దాదాపు 2 గంటలపాటు స్పృహ కోల్పోయారు. ఆ తరువాత ఓపిక తెచ్చుకుని లేచి నడుచుకుంటూ చందారి రైల్వేస్టేషన్ కు చేరుకోగా అక్కడి ప్రయాణికులు వారిని గమనించి, ఏం జరిగిందో తెలుసుకుని, వెంటనే అంబులెన్స్ పిలిపించి వారిని చికిత్స నిమిత్తం లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించారు.
శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి రైల్వే ప్రొటెక్షన్ పోలీసులకు ఆదివారం తెలిసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు కాన్పూర్ జీఆర్పీ స్టేషన్హౌస్ ఆఫీసర్ రామ్మోహన్ రాయ్ తెలిపారు.
రైలు బోగీలో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ తాము రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయితే పోలీసులు వారి వద్ద లంచం పుచ్చుకుని వెంటనే వదిలిపెట్టేయడంతోనే ఆ ఆకతాయి వ్యక్తులు తిరిగి తాము ఉన్న బోగీలోనే ఎక్కి మరింతగా వేధింపులకు పాల్పడ్డారని ఆ బాలిక తల్లి చెబుతోంది.
ఈ ఘటన గురించి సమాచారం అందగానే ఢిల్లీలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న ఆ మహిళ భర్త కాన్పూర్ బయలుదేరాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ మహిళ ఆరోపణలను నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు ఖండించారు.
నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో గౌరవ్ బన్సాల్ మాట్లాడుతూ.. హౌరాలో రైలు బయలుదేరగానే ఆకతాయిలు వేధింపులు మొదలుపెట్టారని, ఆ మహిళ చందారి రైల్వే స్టేషన్ సమీపంలోని రసూలాబాద్ వద్దకు రైలు రాగానే ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు సమీపంలో జరిగిందని, అది తమ పరిధిలోకి రానప్పటికీ ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు స్పందించారని తెలిపారు.












Click it and Unblock the Notifications