ఎన్నోఅనుకుంటే: కొడుకుని చంపి,మహిళా టెక్కీ సూసైడ్
పుణే: పుణేలా దారుణం జరిగింది. 34 ఏళ్ల మహిళ తన ఐదేళ్ల కొడుకు మణికట్టును కోసి, అతని గొంతు నులిమి చంపింది. ఆ తర్వాత తాను బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
శనివారం రాత్రి కొడుకును చంపేసింది. ఈ విషయాన్ని తన భర్తకు సమాచారం అందించాక, ఆదివారం ఉదయం బాల్కనీ నుంచి దూకి చనిపోయింది. తాము నివసిస్తున్న అపార్టుమెంటులోని మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు దీప్తి మోరె. ఆమె ఇన్స్ట్రుమెంటల్ ఇంజినీర్గా పని చేస్తోంది. ఆమె ఐదేళ్ల కొడుకు పేరు అర్నవ్. ఆమె భర్త తేజాస్తో కలిసి పుణేలోను ఓ అపార్టుమెంటులో నివసిస్తోంది.
శనివారం రాత్రి దీప్తి తన కొడుకు అర్నావ్ను అతని బెడ్ రూంకు తీసుకు వెళ్లింది. ఆ సమయంలో భర్త ఆయన బెడ్ రూంలో నిద్రిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దీప్తి తన కొడుకు మణికట్టును కోసింది. ఆ తర్వాత గొంతు నులిమింది.
ఆ తర్వాత ఆదివారం ఉదయం తన భర్త వద్ద... కొడుకును చంపానని ఏడ్చింది. దీంతో వెంటనే భర్త తేజాస్... అర్నవ్ బెడ్ రూంకు వెళ్లాడు. భర్త కొడుకు బెడ్ రూంలోకి వెళ్లగానే... దీప్తి అతనిని ఆ గదిలో బందించింది. బయట గొల్లెం పెట్టింది.
ఆ తర్వాత తాము నివసిస్తున్న మూడో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. భర్త కేకలు వేసి పక్కింటి వారిని పిలిచాడు. వారు వచ్చి తలుపు తీశారు. దీప్తిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆమె ఒత్తిడిలో ఇలా చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.
కాగా, సంఘటన స్థలంలో పోలీసులు ఓ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని రాత ఆమెదిగా చెప్పారు. అందులో ఆమె... తాను తన జీవితంలో ఎన్నో కోరుకున్నానని, తాను అనుకున్న విధంగా జీవితం సాగడం లేదని పేర్కొంది. ఈ కారణంగా తన కొడుకుతో కలిసి చనిపోతున్నట్లు పేర్కొంది.
తాము కేసును విచారణ జరుపుతున్నామని, మేం ఆమె భర్తను కూడా విచారిస్తామని, ఆమె ఎప్పుడు తనకు తానుగానే ఆలోచిస్తూ ఉంటుందని తెలిసిందని, ఇతరులతో పంచుకునేది కాదని తెలిసిందని పోలీసులు చెబుతున్నారు.