వరదల్లో కొట్టుకుపోయిన గ్రామం, తల్లి, కొడుకుల మృతదేహాలు, డ్రోన్ లతో సైనికులు!
మడికేరి (కర్ణాటక): కర్ణాటకలోని మడికేరి సమీపంలోని వరదల్లో గ్రామం మొత్తం కొట్టుకుపోవడంతో గల్లంతు అయిన తల్లీ, కుమారుడి మృతదేహాలను సైనికులు గుర్తించారు. వరద నీటిలో కొట్టుకుపోయిన హెమ్మత్తాల్ గ్రామానికి చెందిన చంద్రావతి (66), ఆమె కుమారుడు ఉమేష్ (26) మృతదేహాలను గుర్తించిన సైనికులు ఆసుపత్రికి తరలించారు.
కొడుగు జిల్లాలోని మడికేరిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ఆ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మడికేరి తాలుకాలోని హెమ్మత్తాల్ గ్రామంలోని ఇండ్లు కుప్పకూలిపోయాయి. చంద్రావతి, ఉమేష్ నివాసం ఉంటున్న ఇల్లు పూర్తిగా వరదల్లో కొట్టుకుని పోయింది.
మూడు రోజుల క్రితం ఇంటితో సహ వరదల్లో కొట్టుకునిపోయిన చంద్రావతి, ఉమేష్ ల కోసం సైనికులు గాలించారు. బుధవారం హెమ్మత్తాల్ గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చంద్రావతి, ఉమేష్ మృతదేహాలను సైనికులు గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు.
Recommended Video
హెమ్మత్తాల్ గ్రామంలో మొత్తం 40 ఇండ్లు ఉన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామంలోని అన్ని ఇండ్లు కొట్టుకుని పోయాయి. సైనికులు, సహాయక సిబ్బంది, రెస్యూ టీం సభ్యులు అనేక మంది గ్రామస్తులను ప్రాణాలతో కాపాడారు. 72 వృద్దురాలితో సహ ఆరు మంది ఇప్పటికీ గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన వారి కోసం డ్రోన్ ల సహాయంతో సైనికులు గాలిస్తున్నారు.