మమతా బెనర్జీకి షాక్: కేంద్రం.. తమ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయాలేదంటూ మదర్ థెరీసా మిషనరీస్
న్యూఢిల్లీ: మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్(స్తంభన) చేశారంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఖండించింది. మమతా బెనర్జీ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. అంతేగాక, తగు రుజువులను కూడా జతచేసింది.
మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయలేదు
మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన ఎలాంటి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్వయంగా తన ఖాతాలను స్తంభింపజేయాలని ఎస్బిఐకి అభ్యర్థన పంపినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ FCRA (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) పునరుద్ధరణ దరఖాస్తు అర్హత నిబంధనలను పాటించనందుకు డిసెంబర్ 25న తిరస్కరించబడిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. "మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (MoC) FCRA రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద రెన్యూవల్ అప్లికేషన్ డిసెంబర్ 25, 2021న FCRA 2010, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్ (FCRR) 2011 కింద అర్హత షరతులను పాటించనందుకు తిరస్కరించబడింది' అని ప్రకటన స్పష్టం చేసింది. "ఈ పునరుద్ధరణ తిరస్కరణను సమీక్షించడానికి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (MoC) నుంచి ఎటువంటి అభ్యర్థన/రివిజన్ దరఖాస్తు స్వీకరించబడలేదు" అని పేర్కొంది.
తమ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయలేదంటూ మదర్ థెరీసా మిషనరీస్ క్లారిటీ
FCRA కింద మిషనరీస్ ఆఫ్ ఛారిటీ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 31, 2021 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. కాగా, తమ ఖాతాలను స్తంభింపజేయాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించలేదని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్పష్టం చేసింది. అంతేగకా, 'మా FCRA పునరుద్ధరణ దరఖాస్తు ఆమోదించబడలేదని మాకు తెలియజేయబడింది. అందువల్ల, ఎటువంటి లోపం లేకుండా చూసుకోవడానికి, ఈ విషయం పరిష్కరించబడే వరకు FC ఖాతాలలో దేనినీ ఆపరేట్ చేయవద్దని మేము మా కేంద్రాలను కోరాము' అని సంస్థ తెలిపింది.
కేంద్రమే మదర్ థెరీసా మిషనరీస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిందంటూ మమత
కేంద్ర ప్రభుత్వమే మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిందంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. 'క్రిస్మస్ సందర్భంగా, కేంద్ర మంత్రిత్వ శాఖ భారతదేశంలోని మదర్ థెరిసాకు చెందిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అన్ని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది! వారి 22,000 మంది రోగులు, ఉద్యోగులు ఆహారం, మందులు లేకుండా పోయారు. చట్టం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ, మానవతా ప్రయత్నాలకు రాజీ పడకూడదు' మమతా బెనర్జీ సోమవారం ట్వీట్ చేశారు. మదర్ థెరిసా ప్రారంభించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి కోల్కతాలో ప్రధాన కార్యాలయం ఉంది. కాగా, మమతా బెనర్జీ ఆరోపణల్లో వాస్తవం లేదని స్వయంగా మదర్ థెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ విడుదల చేసిన ప్రకటన ద్వారా తేలిపోయింది. దీంతో మమతా బెనర్జీ అసత్యపు ప్రచారంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న మమతా బెనర్జీ.. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు సువేందు అధికారి, సౌమిత్రా ఖాన్ మండిపడ్డారు.