రాహు, కేతువుల్లా.. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ : శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శనాస్త్రాలు
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం హట్ హాట్ గా సాగుతుంది. ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీ , కేజ్రీవాల్ .. రాహు, కేతువులుగా ..
కాంగ్రెస్, ఆప్లలో ఏ ఒక్క పార్టీయైనా ఉత్తరాఖండ్లో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ , ఆప్లతో రాష్ట్రాభివృద్ధి కుంటుడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ , కేజ్రీవాల్ రాహు, కేతువులుగా వ్యవహరిస్తున్నారని అభివర్ణించారు. వీరిద్దరూ అభివృద్ధి నిరోధకులుగా మారతారన్నారు. కాంగ్రెస్, ఆప్ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్లోని శ్రీనగర్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శివరాజ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై విరుచుకుపడ్డారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
ఉత్తరాఖండ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిజాయితీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీజేపీని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ను అంతర్జాతీయ హిందువుల రాజధానిగా మలుస్తామని హామీ ఇచ్చారు. హరిద్వార్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పేదల కష్టాలను మోదీ ఆలకించడంలేదు
ఉద్ధంసింగ్ నగర్ జిల్లాలో జరిగిన కిసాన్ మేళాలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీజేపీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ప్రజల మాటలను పెడచెవినపెడుతూ.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల సాగు చట్టాలను తెచ్చి రైతుల ఉసురు తీయటానికి కుట్ర చేశారని ఆరోపించారు. రైతులు, పేదల కష్టాలను మోదీ సర్కార్ ఆలకించడంలేదని మండిపడ్డారు. యూపీఏ పాలనలో రైతులు, పేదల సమస్యలను సావధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం విని పరిష్కరించేందుకు ప్రయత్నించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే అన్ని వర్గాలకు న్యాయం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications