ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఘోరం: మాజీ మంత్రిపై రేప్ కేసు - అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్
భోపాల్: మధ్యప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ శాసన సభ్యుడు, మాజీమంత్రిపై అత్యాచార కేసు నమోదైంది. ఈ ఘటన అటు రాజకీయంగా కలకలం రేపుతోంది. అధికార భారతీయ జనత పార్టీ దీన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంటోంది. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఉమంగ్ సింఘర్పై..
ఆ శాసన సభ్యుడి పేరు ఉమంగ్ సింఘర్. ధార్ జిల్లాలోని గంధ్వాని అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2008 నుంచి వరుసగా ఆయనే ఇక్కడ విజయం సాధిస్తోన్నారు. ఇదివరకు కమల్నాథ్ ప్రభుత్వం మంత్రిగా పని చేశారు. అటవీ మంత్రిత్వ శాఖను పర్యవేక్షించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జమునా దేవికి స్వయానా మేనల్లుడు. ఇప్పుడాయన అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు.

ఏడాది కాలంగా..
38 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ధార్ సిటీలోని నౌగావ్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. బాధితురాలి ఫిర్యాదులో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఉమంగ్ సింఘర్ తనను ఏడాది కాలంగా నిర్బంధించి శారీరకంగా హింసించాడని ఆరోపించారు. రోజూ అత్యాచారానికి చేసేవాడని, లైంగిక వేధింపులకు గురి చేసేవాడని పేర్కొన్నారు. అసహజ లైంగిక చర్యలకు పాల్పడే వాడని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తామని బెదిరించే వాడని బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

అశ్లీల వీడియోలతో..
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయా అంశాలను పొందుపరిచారు. తనపై అఘాయిత్యాన్ని వీడియోల్లో చిత్రీకరించేవాడని, వాటిని అడ్డుగా పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడని బాధితురాలు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన పెళ్లి చేసుకున్న తరువాత శారీరక హింస మరింత తీవ్రమైందని అన్నారు. గంధ్వానీలో పీడబ్ల్యూడీ కార్యాలయం వెనుక వైపు ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో తనను నిర్బంధించాడని బాధితురాలు వివరించారు.

చట్టపర చర్యలు..
ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే ఉమంగ్ సింఘర్పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ధార్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ తెలిపారు. సెక్షన్ 294, 323, 376 (2), 377, 498 (ఎ), 506 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనను మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ధృవీకరించారు. ఉమర్ సింఘార్పై కేసు నమోదైందని స్పష్టం చేశారు. చట్టపరంగా ఆయనపై అన్ని రకాల చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications