ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ కృష్ణరాజు డిశ్చార్జి.... నేరుగా ఢిల్లీకి పయనం...
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం(మే 26) డిశ్చార్జి అయ్యారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన... ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మెరుగైన వైద్యం కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్మీ ఆస్పత్రి వైద్యులు బుధవారం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి సమ్మరీని అందజేసినట్లు తెలుస్తోంది. బెయిల్ కోసం ప్రభుత్వం పది రోజుల గడువు ఇవ్వడంతో రఘురామ తరుపు న్యాయవాది ఆ ప్రక్రియను చూసుకోనున్నారు.
ఏపీ ప్రభుత్వంపై కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాజద్రోహం కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఇటీవలే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నిజానికి నాలుగు రోజుల క్రితమే ఆయన డిశ్చార్జి కావాల్సి ఉన్నా వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. సుప్రీం మార్గదర్శకాల మేరకు వైద్యుల తుది నివేదిక ఆధారంగా రఘురామ తరుపు న్యాయవాది లక్ష్మినారాయణ గుంటూరు మెజిస్ట్రేట్ నుంచి బెయిల్ ఆర్డర్ తీసుకురానున్నారు.
రఘురామకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్లాలి.. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు... దర్యాప్తును ప్రభావితం చేయకూడదు...మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు... వంటి షరతులతో రఘురామకు బెయిల్ మంజూరు అయింది. వాటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. కోర్టు ఆదేశాల మేరకు రఘురామ అటు మీడియాకు,ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
రఘురామ బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా వాడి వేడి వాదనలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, రఘురామరాజు తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రఘురామ కాలికి గాయం అయినట్లు ఆర్మీ ఆస్పత్రి సుప్రీం కోర్టుకు సుప్రీంకు నివేదిక సమర్పించింది. అంతకుముందు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి వైద్యులు రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చారు. అయితే ఆర్మీ ఆస్పత్రి నివేదికపై సీఐడీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రఘురామరాజు తానే కాలికి గాయం చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.