దేశంలో 'ఆందోళన్ జీవి' అనే కొత్త జాతి... వాళ్లతో జాగ్రత్త.. : రాజ్యసభలో ప్రధాని మోదీ
పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గతంలో ఉన్నది... ఇప్పుడు ఉన్నది... ఇకముందు కూడా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.కనీస మద్దతు ధర(MSP) వ్యవస్థ కొనసాగుతుందని హామీ ఇచ్చిన ప్రధాని... రైతులను మరోసారి చర్చలకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని సోమవారం(ఫిబ్రవరి 8) రాజ్యసభలో మాట్లాడారు.
Recommended Video
'మా వ్యవసాయ శాఖ మంత్రి రైతు సంఘాల నేతలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఎటువంటి టెన్షన్ లేదు... ఈరోజు ఈ రాజ్యసభ వేదిక నుంచే మరోసారి రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నా. అయితే సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేసే ఉద్దేశంతోనే వారు రావాలి.' అని ప్రధాని స్పష్టం చేశారు.
రైతుల ఆందోళనలను ఉద్దేశించి ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో 'ఆందోళన్ జీవి' అనే కొత్త రకం జాతి పుట్టుకొచ్చిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడ ఏ ఆందోళన జరిగినా... అది న్యాయవాదులదైనా,విద్యార్థులదైనా,కూలీలదైనా.. ఈ ఆందోళన్ జీవులు అక్కడ వాలిపోతారని ఎద్దేవా చేశారు. ఆందోళనలు లేకుండా వారు జీవించలేరని... అలాంటివారిని గుర్తించి వారి నుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విదేశీ విధ్వంసక భావజాలం(Foreign destructive ideology) నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. మనకు ఎఫ్డీఐ(Foreign direct investments) అవసరమే గానీ ఈ ఎఫ్డీఐ(Foreign destructive ideology) నుంచి మాత్రం మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా దేశానికి సిక్కులు అందించిన సేవలను ఆయన కొనియాడారు. సిక్కులు ఈ దేశానికి ఎంతో చేశారని... అలాంటి సిక్కుల ప్రతిష్ఠనే దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు.
గతంలో వ్యవసాయ చట్టాలను సమర్థించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూటర్న్ తీసుకుందని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చే సంస్కరణలని అభిప్రాయపడినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన మాట వినకపోయినా కనీసం మన్మోహన్ సింగ్ మాట వినాలని సూచించారు.
కాగా,రైతులతో ఇప్పటికే పలుమార్లు కేంద్రం జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. కేంద్రం ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాలను పక్కనపెట్టేందుకు ముందుకు వచ్చినప్పటికీ రైతులు మాత్రం వాటి రద్దుకే పట్టుబడుతున్నారు. గత నెలలో సుప్రీం కోర్టు ఈ చట్టాలపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.చర్చలు జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ... రైతులు ఆ కమిటీని ఒప్పుకోలేదు.