సెక్షన్ 17ఏ- సిద్ధరామయ్యకు బిగ్ షాక్..!!
Siddaramaiah: కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA scam)లో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న భారీ కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ అంశంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణను ఎదుర్కొనాల్సిందేనని తేల్చి చెప్పింది.
కొద్దిరోజులుగా ముడా కుంభకోణం.. కర్ణాటకలో రోజూ వార్తల్లో ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఉందని, ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతూ వస్తోన్నాయి. ప్లాట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారనే విమర్శలను ఎదుర్కొంటోన్నారు.

దాదాపుగా 55 కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్లను తన భార్య పార్వతి పేరు మీద బదలాయించినట్లు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తోన్నారు. ఈ అంశంపై గతంలో ప్రతిపక్ష బీజేపీ- జనతాదళ్ (సెక్యులర్) నాయకులు పలుమార్లు ఆందోళనలు సైతం చేపట్టారు.
ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యను విచారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపించింది. దీనికి అనుగుణంగా- టీజే అబ్రహం, ప్రదీప్, స్నేహమయి కృష్ణ.. రాజ్భవన్ను ఆశ్రయించారు. సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తును దాఖలు చేసుకున్నారు. ముడా స్కాంకు సంబంధించిన్న కొన్ని కీలక డాక్యుమెంట్లను వాటికి జత చేశారు.
దీనిపై జులై 26వ తేదీన గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్.. సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసును జారీ చేశారు. దీనికి వారం రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణలు, సమాధానాలను ఇవ్వాలంటూ ఆదేశించారు. దీన్ని తప్పు పట్టింది కర్ణాటక ప్రభుత్వం. దీనికి స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆగస్టు 1వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది.
సిద్ధరామయ్య నుంచి సంతృప్తికర వివరణ అందకపోవడంతో విచారణకు ఆదేశించారు గవర్నర్. దీన్ని సవాల్ చేస్తూ ఆయన ఈ ఉదయం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులూ చేయలేదని అన్నారు.
ఆ పిటీషన్లను విచారణకు స్వీకరించింది హైకోర్టు. అప్పట్లో తాత్కాలికంగా ఆయనకు ఊరట ఇచ్చింది. అప్పటికప్పుడు విచారణ జరిపించడంపై స్టే మంజూరు చేసింది. సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటీషన్లన్నింటినీ కూడా హైకోర్టు కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న సారథ్యంలోని బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ఎవరైనా సరే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోక తప్పదని వ్యాఖ్యానించింది. సొంతంగా ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకునే అధికారం గవర్నర్కు ఉందనీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications