ముకేష్ అంబానీ బాంబ్ స్కేర్: ముంబైకి కొత్త పోలీస్ కమిషనర్గా హేమంత్ నగ్రాలే, పరమ్ బీర్ బదిలీ
ముంబై: మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త పోలీస్ కమిషనర్ నియమితులయ్యారు. పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో.. ఆయన స్థానంలో హేమంత్ నగ్రాలే కొత్త కమిషనర్గా బుధవారం బాధ్యతలు చేపట్టారు.
ప్రముఖ వ్యాపారవేత్త, భారత కుబేరుడు ముకేష్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థలతో కూడిన కారు నిలిపిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంబైకి కొత్త బాస్ రావడం గమనార్హం. ఈ సందర్భంగా కొత్త ముంబై బాస్ హేమంత్ నగ్రాలే మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం చోటు చేసుకున్న కొన్ని చెడు సంఘటనల కారణంగా ముంబై పోలీసుల ప్రతిష్ట మసకబారే పరిస్థితి తలెత్తిందని హేమంత్ అన్నారు. ముంబై పోలీసుల కీర్తి, ప్రతిష్టలను తిరిగి సాధిస్తామన్నారు. తాము చట్టం ప్రకారం వ్యవహరిస్తామని, అధికారులందరూ చట్టం ప్రకారం వారి విధులు నిర్వర్తించాలని తేల్చి చెప్పారు.
మరో పెద్ద పునర్వ్యవస్థీకరణ ఏమంటే.. రజనీష్ సేథ్ మహారాష్ట్ర డీజీపీగా నియమితులు కాగా, సంజయ్ పాండే మహారాష్ట్ర స్టేట్ సెక్యూరిటీ కార్పొరేషన్కు నాయకత్వం వహిస్తారు. కాగా, ముంబై పోలీస్ కమిషనర్గా ఉన్న పరమ్ బీర్ సింగ్ను మహారాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ డీజీగా బాధ్యతలను అప్పగించింది.
కాగా, ముకేష్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం నిలిపిన కేసులో ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కారు కూడా ఆయనే నిలిపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మేరకు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన అధికారులు నిర్ధారిస్తున్నారు.