తీవ్ర అస్వస్థత: ముంబైలో ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్
ముంబై: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఆయనను చేర్పించారు.
ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ముంబైకి తరలించాలని వైద్యులు సూచించడంతో ఇక్కడ చేర్పించామని ఎస్పీకి చెందిన నేత ఒకరు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ములాయం.
ములాయం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది ఈరోజు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తామని వైద్యులు వెల్లడించారు. కాగా, 80ఏళ్ల ములాయం యూపీ సీఎంగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టారు.
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ఎస్పీ అధినేతగా కొనసాగుతున్నారు. ఆయన కూడా యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు.