కోరికలు కలిగించే ఇంజెక్షన్లు ఇస్తూ..ఎనిమిదేళ్లుగా బాలికపై రేప్: మహిళ సహా
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులు.. ఎనిమిదేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తోన్నారు. ఈ నలుగురిలో దంపతులు కూడా ఉన్నారు. నిందితుల చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 27 పేజీల ఫిర్యాదును పోలీసులకు ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరస్ట్ చేశారు. నిందితులందరూ దగ్గరి బంధువులే.
ఆ బాలిక- అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె. ఎనిమిదేళ్ల వయస్సులో ఆమెను కొందరు కిడ్నాప్ చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక కోసం గాలించారు. ఆచూకీ తెలియరాలేదు. బాలికను కిడ్నాప్ చేసిన వారు ఆమెపై అత్యాచారం చేశారు. దాన్ని వీడియోలు తీశారు. ఆ బాలికకు సెక్స్కు ప్రేరేపించే యాఫ్రోడిసియాక్స్ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బాధితురాలు స్పృహలో లేని సమయమే అధికమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను బెదిరించే వారు. తమ ఘాతుకానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించేవారు. ఎనిమిదేళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడేవారు. నలుగురు నిందితుల్లో ఓ మహిళ ఉన్నారు. తన భర్తతో బాధిత బాలికపై అత్యాచారానికి ప్రోత్సహించేదని పోలీసులు తెలిపారు. నిందితుల చెర నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 27 పేజీలతో కూడిన కంప్లయింట్ ఇచ్చారు.
నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేయడానికి తనను ఉత్తర ప్రదేశ్కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభిషేక్ త్రిముఖె తెలిపారు. ఈ ఘటనతో ప్రమేయం ఉందని కొందర్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఉత్తర ప్రదేశ్కు పంపించినట్లు చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అన్నారు.