పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!
ముంబై : నెలనెలా కొంత దాచుకుంటే కొంప ముంచింది గోల్డ్ స్కీమ్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు బాధితులు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. మధ్య తరగతి ప్రజల ఆశల్ని క్యాష్ చేసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు చివరకు బిచాణా ఎత్తేశారు. ముంబైలోని గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఖాతాదారుల జేబులు గుల్ల చేసిన వైనం వెలుగు చూసింది. పెద్ద సంఖ్యలో బాధితులు బయటకు రావడంతో చివరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్మకమే పెట్టుబడిగా సదరు సంస్థ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
అధికంగా చెల్లిస్తామని చెప్పి.. మంత్లీ సేవింగ్ స్కీమ్తో బోల్తా
ముంబైకి చెందిన కొందరు మధ్య తరగతి ప్రజల ఆశల్ని చిధ్రం చేశారు. నెలనెలా కొంత దాచుకుంటే తిరిగి అధికంగా చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్పి వేలాది మందిని బోల్తా కొట్టించారు. గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు ఖాతాదారులకు శఠగోపం పెట్టిన తీరు ఇప్పుడు ముంబైలో హాట్ టాపికైంది. కస్టమర్లను నిలువునా ముంచేసిన సదరు సంస్థ ప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటూ పెద్ద స్కెచ్ వేసి ఖాతాదారుల నుంచి పెద్ద మొత్తంలో కొల్లగొట్టారు. నెలనెలా కొంత మొత్తం వినియోగదారుల నుంచి సేకరించిన సదరు సంస్థ ప్రతినిధులు తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చేసరికి పత్తా లేకుండా పోయారు. దాంతో ఖాతాదారులు అయోమయానికి గురవుతున్నారు.
ఓ తల్లి, ఇద్దరు ప్రియులు.. కూతురు రాసలీలలు.. నిలదీస్తే చంపేసింది..!
కొంప ముంచారుగా
మంత్లీ సేవింగ్స్ స్కీమ్ అంటూ బురిడీ కొట్టించారు గుడ్విన్ సంస్థ ప్రతినిధులు. నెల నెలా ఖాతాదారుల నుంచి సొమ్ము వసూలు చేసి ఇప్పుడేమో కానరాకుండా పోయారు. ముంబైకి చెందిన 38 ఏళ్ల సరిత.. ప్రతి నెల ఈ షోరూమ్లో కొంత చెల్లిస్తూ ఈ స్కీమ్లో చేరారు. అయితే ఈ నెల 21వ తేదీ నాటికి ఆ సంస్థ ప్రతినిధులు ప్రామిస్ చేసినట్లుగా ఆమెకు నగదు చెల్లించాల్సి ఉంది. కానీ అప్పటికే సంస్థ బోర్డు తిప్పేశారు నిర్వాహకులు. దీపావళి పండుగకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని భావించిన సరితకు నిరాశే మిగిలింది. షోరూమ్ తాళాలు తీయక.. సంస్థ ప్రతినిధుల జాడ లేక ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ.. దీన గాథ
కూతురు పెళ్లి కోసమంటూ మరో మహిళ ఈ సంస్థలో డబ్బులు దాచుకున్నారు. 52 సంవత్సరాల అనామిక గుడ్విన్ సంస్థలో 7 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. ఆమెకు కూడా సదరు సంస్థ డబ్బులు చెల్లించాల్సి ఉంది. వాటితో కూతురు పెళ్లికి కావాల్సిన నగలు కొందామనేది ఆవిడ ప్లాన్. కానీ సీన్ రివర్సైంది. గుడ్విన్ నగల షాపుకు తాళాలు పడటంతో ఆమె బాధ వర్ణనాతీతం. చివరకు ఆమె కూతురు పెళ్లికి ఏం చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. దీపావళికి బంగారు ఆభరణాలు కొందామని భావించిన మరో వినియోగదారుడు సత్యం కూడా గుడ్విన్ దెబ్బకు విలావిల్లాడుతున్నారు. ఇలా ఈ సంస్థను నమ్మి పెట్టుబడులు పెట్టిన వేల మంది కస్టమర్లు తాము మోసపోయామని లబోదిబమంటున్నారు.
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. మహిళా కండక్టర్ ఆత్మహత్య.. తాత్కాలిక సిబ్బందితో పరేషాన్..!
పలువురిపై కేసు నమోదు.. నిందితులను పట్టుకోవాలంటూ బాధితుల డిమాండ్
గుడ్విన్ జ్యువెల్లరీ షాపు ఓపెన్ చేయడం లేదనే విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో దీపావళి పండుగ అని కూడా చూడకుండా శని, ఆదివారాలు పెద్ద సంఖ్యలో బాధితులు సదరు షోరూమ్ దగ్గరకు చేరుకున్నారు. ఆ క్రమంలో అందరూ కలిసి ఆ షాపు ఎదుటే నిరసనకు దిగారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఆ సంస్థపై కేసు నమోదు చేశారు. గుడ్విన్ ఛైర్మన్ సుధీర్తో పాటు ఎండీ సుధీష్, స్టోర్ మేనేజర్గా పనిచేసిన మనీష్పై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సోమవారం నాడు కూడా సదరు షోరూమ్ దగ్గర బాధితులు పెద్ద సంఖ్యలో పోగై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.