రిజైన్ చేసి రాజకీయాల్లోకి ముంబై సిపి: బిజెపి టికెట్?
ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ తన పదవీ బాధ్యతలకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాను మే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సత్యపాల్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ముంబైకే పరిమితమయ్యానని, రాజకీయాల్లో ప్రవేశించి దేశానికి సేవ చేస్తానని 59 ఏళ్ల ఈ ఐపిఎస్ అధికారి తెలిపారు.
అయితే తాను ఏ పార్టీలోకి వెళ్లే విషయాన్ని సత్యపాల్ సింగ్ తెలపలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టికెట్పై పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ముంబై నుంచి సత్యపాల్ సింగ్కి బిజెపి టికెట్ ఇచ్చే విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని మహారాష్ట్రకు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
సత్యపాల్ సింగ్ 1980 బ్యాచుకు చెందిన ఐపిఎస్ అధికారి. ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్కు చెందినవారు. కాబట్టి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేగాక అతనికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా అవకాశం వచ్చినట్లు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా తాను అన్ని పార్టీలకు సన్నిహితంగా ఉంటానని సత్యపాల్ సింగ్ చెప్పారు.
తాను మహారాష్ట్ర నుంచే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. గత 30 ఏళ్లుగా ఆయన ముంబైకి సేవలందించారు. తాను ఏ పార్టీలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, నిర్ణయం తీసుకున్న తర్వాత తానే చెబుతానని సత్యపాల్ సింగ్ అన్నారు. సింగ్ 2015లో రిటైర్ కావాల్సి ఉండగా, తన పదవికి సర్వీసులో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా కెమెస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యూయేట్ చేసిన సత్యపాల్ సింగ్, ఆస్ట్రేలియా నుంచి ఎంబిఏ పట్టాను పొందాడు. అంతేగాక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి కూడా చేశారు.