పోలీసు వేలు కొరికాడు, సగ భాగాన్ని వెతికేందుకు మూడు గంటలు
ముంబై: ముంబై పోలీసు డిపార్ట్మెంట్ ఆశ్చర్యపోయే సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్స్... మద్యం తాగారని ఇద్దరు ఎంబీఏ చదవుతున్న యువకులను అర్ధరాత్రి పట్టుకోగా, అందులో ఒకడు పోలీసును చెంపపై కొట్టాడు. మరొకడు ఏకంగా కానిస్టేబుల్ చిటికి వేలిని కోరికాడు. నిందితుడు కొరికిన చిటికిన వేలులోని సగభాగాన్ని వెతికేందుకు పోలీసులకు సుమారు మూడు గంటల సమయం పట్టింది.
వివరాల్లోకి వెళితే... ఆదివారం అర్ధ రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బోరివెలీ పోలీస్ స్టేషన్కు ఐదుగురు కానిస్టేబుల్స్ ఉన్న బృందం సుమెర్ నగర్ ప్రాంతంలో ఉన్న రాజేంద్ర నగర్ బ్రిడ్జి వద్ద బ్లాక్ చేశారు. సుమారుగా 2.50 గంటల ప్రాంతంలో హోండా యాక్టివా స్కూటర్ మీద ఇద్దరు యువకులు పెద్దగా అరుచుకుంటూ వస్తున్నారు.
మద్యం తాగారేమోనని అనుమానం వచ్చి వారిద్దరిని ఆపామని పోలీసు కానిస్టేబుల్స్ ఒకడైన సురేష్ చాగులే తెలిపారు. వారిద్దరిని రామంత్ సింగ్ (29), జితేంద్ర పాండే (27)గా గుర్తించామన్నారు. ఢిల్లీకి చెందిన వీరిద్దరూ ముంబైలో ఎంబీఏ విద్యనభ్యసిస్తూ ఛార్కాప్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
పాండేని స్కూటర్కి సంబంధించిన పేపర్లతో పాటు లైసెన్స్ని అడిగామని... వారిద్దరి వద్ద లైసెన్స్ లేకపోవడంతో వారిని మద్యం తాగి వాహనం నడపడం నేరం కాబట్టి ఆ చట్టం కింద పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లదామని నిర్ణయించామన్నారు.
పోలీస్ వ్యాన్లో ఎక్కించేందుకు వారిద్దరిని పక్కకు నిలబడమని చెప్పి, పాండేని తాగి ఎందుకు వాహనం నడుపుతున్నారని అడగ్గా... ఏమాత్రం ఆలోచించకుండా పాండే చెంపపై కొట్టాడని చెప్పారు. కాస్త దూరంలో ఉన్న మిగతా పోలీసులకు ఏం జరిగిందో తెలియక హాడావుడిగా వ్యాన్ వద్దకు పరుగెత్తుకొచ్చారు.
దీంతో పాండేకు సమీపంలో ఉన్న కానిస్టేబుల్ దీపక్ ఎడమచేతి చిటికిన వేలిని అమాంతం నోటపుచ్చుకుని కోరికాడు. దీపక్ చిటికిన వేలి నుంచి రక్తం కారసాగింది. వెంటనే సమీపంలో ఉన్న శతాబ్ధి ఆసుపత్రికి దీపక్ను తరలించారు.
దీపక్ ఎడమచేతిని పరిశీలించిన డాక్టర్లు చిటికిన వేలులో సగ భాగం కనిపించడం లేదంటూ వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దగ్గరలో ఉన్న మలాడ్లోని లైఫ్ లైన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీపక్ ఎడమ చేతి చిటికిన వేలు నుంచి కింద పడిన సగ భాగాన్ని వెతికేందుకు తమకు మూడు గంటల సమయం పట్టిందన్నారు.
వెతికితెచ్చిన సగభాగాన్ని డాక్టర్లు అతికించడం కష్టమని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాండే, సింగ్ ఇద్దరూ మద్యం ఎక్కువ మొత్తంలో సేవించారని తెలిపారు.